రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
● ఎస్పీ శరత్చంద్ర పవార్
గుర్రంపోడు : రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతిఒక్కరి బాధ్యత అని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం గుర్రంపోడులో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిచారు. రోడ్డు ప్రమాదాలు.. చాలా వరకు నిర్లక్ష్యం, అతివేగం, ట్రాఫిక్ నియమాలపై అవగాహన లేకపోవడం వల్ల జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెంట్ ధరించడం తప్పనిసరి అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. కార్యక్రమంలో దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, మల్లేపల్లి సీఐ నవీన్కుమార్, గుర్రంపోడు ఎస్ఐ వెంకన్న, రిటైర్డ్ సీఐ అంజయ్య, సర్పంచ్ జాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ
నల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 40 మంది వ్యక్తిగత, భూ వివాదాలు, కుటుంబ, ఆర్థిక మోసాలు, సైబర్ నేరాలపై ఫిర్యాదులు సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ.. సమస్యలపై తక్షణ విచారణ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేకంగా ఫాలోఅప్ చేసి, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
బుద్ధవనాన్ని సందర్శించిన వియత్నాం బౌద్ధులు
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని వియత్నాం దేశానికి చెందిన 41మంది బౌద్ధ భిక్షవులు సోమవారం సందర్శించింది. హైదరాబాద్లో బౌద్ధుల సమావేశానికి హాజరైన వారు సాగర్ బుద్ధవనానికి వచ్చారు. బుద్ధవనంలోని బుద్ధుడి పాదాల చెంత పుష్పాంజలి ఘటించారు. బుద్ధచరిత వనం, జాతకవనం, ధ్యానవనం, స్థూపవనాలను వీక్షించారు. మహాస్థూపంలో ధ్యానం చేశారు. వారికి బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర కండువాలు కప్పి, బుద్ధుడి చరత్రను తెలిపే బ్రోచర్లను అందజేశారు. అనంతరం వారు లాంచీల్లో వెళ్లి నాగార్జునకొండలోని పురావస్తు మ్యూజియాన్ని సందర్శించారు.
వ్యాస రచన పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
రామగిరి(నల్లగొండ ) : హైదరాబాద్ ఏవీ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ కళాశాలలో నిర్వహించిన తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాల్లో నల్లగొండ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచనట్లు తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్ తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మాదక ద్రవ్యాల ప్రమాదాలు అంశంపై నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిని ఎంజీ యూనివర్సిటీ విద్యార్థిని పి.హేమలత, సి.శివకుమార్, డిగ్రీ విద్యార్థులు పి.నిశ్చల, వి.సుజాత, నందిని, ఎస్.నాగలక్ష్మికి తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిద్దారెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందాచారి, కుకుడాల గోవర్ధన్, సి.అనిత, ఏబూసి నరసింహ, హసేన, దాసరి శ్రీరాములు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత


