గద్వాలన్యూటౌన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేయాలని ఉమ్మడి మహబూబ్నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ, ప్రజాసంఘాల నాయకులు ఆలూరు ప్రకాశ్గౌడ్, మధుసూదన్బాబు, ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక టీజేఎస్ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సాగునీటి ప్రాజెక్ట్లపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నదుల్లో నీరు ఉండి, వ్యవసాయ యోగ్యమైన భూములు ఉన్నప్పటికీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా సాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పారు. ఆర్డీఎస్, జూరాల, పాలమూరు–రంగారెడ్డి, కోయిల్సాగర్ ప్రాజెక్టుల ద్వార నిర్ణయించిన మేరకు సాగునీరు అందించకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వరద జలాల పేరుతో 2005లో చేపట్టిన కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలను సత్వరం పూర్తి చేయడంతో పాటు వీటికి నికరజలాలు సాధించాలన్నారు. జస్టిస్ బచావత్, రాజారావు కమిటీలతో నికర జలాల కేటాయింపులున్న ఆర్డీఎస్, జూరాల, భీమా–1, 2, కోయిల్సాగర్ పథకాలకు నీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. చంద్రసాగర్–అమ్రాబాద్ ఎత్తిపోతల, వెల్టూరు, గొందిమల్ల బ్యారేజ్, జూరాల–గట్టు ఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు వినోద్కుమార్, సుభాన్, వాల్మీకి, డా.ప్రేమ్కుమార్, నాగన్న, కృష్ణ ఉన్నారు.


