ములుగు: రైస్ మిల్లు యజమానులపై పాలకుల ధోరణికి నిరసనగా మంగళవారం నుంచి జిల్లాలో మిల్లింగ్ నిలిపివేసి నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నట్లు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వకుండా తప్పులు చేసిన రైస్ మిల్లర్ల యజమానులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా.. తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రభుత్వం ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో కొత్త నిబంధనలను పెడుతూ మిల్లర్లపై కక్షపూరిత ధోరణి అవలంభిస్తుందన్నారు. రైతులు పండించిన సన్న ధాన్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులు బలవంతంగా 9 నెలల క్రితం రైస్ మిల్లులకు దిగుమతి చేసి, ఇప్పటివరకు బియ్యాన్ని తీసుకోలేదని దీంతో ధాన్యం బస్తాల్లో తరుగు ఏర్పడి నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కార్పొరేట్ వ్యవస్థను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పలుసార్లు మంత్రులు, అధికారులకు వినతి పత్రాలు అందజేసినా స్పందన లేదన్నారు. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించి మంగళవారం నుంచి సమ్మె చేపడుతున్నామని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గురిజాల సహోదర్రెడ్డి, కోశాధికారి ఎలగందుల మోహన్, సభ్యులు పాల్గొన్నారు.
రైస్ మిల్లర్స్ అసోసియేషన్
జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్


