● కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు: ప్రణాళికతో బోధించి విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు సూచించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల, కళాశాలలోని నిఘా కెమెరాల పనితీరు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు శాతాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్న అనంతరం తరగతి గదులను సందర్శించి బోధన తీరును పరిశీలించారు. జూనియర్ కళాశాల విద్యార్థినులకు నిర్వహిస్తున్న యూనిట్ పరీక్షల తీరును పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. భోజనం తయారీలో నాణ్యత, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. విద్యార్థినులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, విద్యాభ్యాసం, ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ స్వాతి, రికార్డు అసిస్టెంట్ రాజు, సంబంధిత అధికారులు, విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.


