కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఈ నెల 31న అధికారికంగా ముగిసినా భక్తుల తాకిడి మాత్రం తగ్గడం లేదు. సమ్మక్క రోజు గురువారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి పుట్టు వెంట్రుకలు సమర్పించుకున్నారు. అనంతరం గద్దెల వద్ద పసుపు, కుంకుమ, కానుకలు, ఎత్తు బంగారం, ఒడి బియ్యం, చీర సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే సమ్మక్క గద్దె వద్ద కోడె ధ్వజస్తంభానికి పలువురు భక్తులు కోడెను కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. వేలాది మంది భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలిరావడంతో జంపన్నవాగు నుంచి గద్దెల వరకు వాహనాలు బారులుదీరాయి. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు.
కన్నెపల్లి ఆలయంలో సమ్మక్కకు మొక్కులు
కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో తిరుగువారం పండగ సందర్భంగా రెండోరోజు సమ్మక్కకు సారలమ్మ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోసారి గుడిని శుద్ధి చేసి పసుపు, కుంకుమలతో అలంకరించారు. గుడి ఆవరణలో కూడా అందంగా ముగ్గులు వేశారు. సారలమ్మ పూజారులు సమ్మక్కకు నైవేద్యంగా యాటను సమర్పించి మొక్కును చెల్లించారు. పూజారులతో పాటు గ్రామస్తులు సారలమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించి యాటలు, కోళ్లను సమర్పించారు. ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు భారీగా వచ్చి సారలమ్మ గుడికి చేరుకొని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
వేలాదిగా తరలివచ్చి మొక్కుల చెల్లింపు
కన్నెపల్లిలో రెండోరోజు సమ్మక్కకు మొక్కు
కొనసాగుతున్న భక్తుల రద్దీ
కొనసాగుతున్న భక్తుల రద్దీ


