
ఇంకా ఇన్స్పైర్ కాలేదు!
నామినేషన్లు పంపించాలి..
● ‘ఇన్స్పైర్ మనక్’ అవార్డుల నామినేషన్లు వేయించేందుకు
పెద్దగా ఆసక్తి చూపని హెచ్ఎంలు, టీచర్లు
● 789తో మహబూబాబాద్ రాష్ట్రంలోనే మొదటి స్థానం
● మిగిలిన జిల్లాల్లో తక్కువగా వేసిన విద్యార్థులు
విద్యారణ్యపురి: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇన్స్పైర్ అవార్డు మనక్ చక్కటి వేదికగా నిలుస్తోంది. విద్యార్థులు భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో.. భాగంగా శాస్త్రసాంకేతిక శాఖ (డీఎస్టీ), నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) ద్వారా ప్రతి సంవత్సరం ఇన్స్పైర్ అవార్డుల మనక్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, వివిధ గురుకులాల్లోని ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థుల మేధస్సుకు పదును పెడుతోంది. 2025–26 విద్యాసంవత్సరంలో ఒక్కో పాఠశాలల నుంచి ప్రాజెక్టుల రూపకల్పనకు ఐదు చొప్పున నామినేషన్లు స్వీకరిస్తున్నారు. జూన్ 15 నుంచి ఆగస్టు 15 వరకు మహబూబాబాద్ జిల్లా మినహా మిగిలిన ఐదు జిల్లాల్లో విద్యార్థులతో నామినేషన్లు చేయించేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పెద్దగా ఆసక్తి చూపలేదు. మహబూబాబాద్ జిల్లా 789 నామినేషన్లతో రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. సెప్టెంబర్ 15 వరకు గడువు ఉండడంతో ఇంకా నామినేషన్లు పెరిగే అవకాశం ఉంది.
సైన్స్ టీచర్లు ఎక్కువగా శ్రద్ధ వహిస్తేనే..
ఉమ్మడి జిల్లాలోని డీఈఓలు, జిల్లా సైన్స్ అధికారులు ఇప్పటికే అన్ని యాజమాన్యాల పాఠశాలల హెచ్ఎంలతో సమావేశాలు నిర్వహించారు. ఇన్స్పై ర్ అవార్డులకు నూతన ఆవిష్కరణల ప్రాజెక్టులతో విద్యార్థులతో నామినేషన్లు చేయించాలని ఆదేశించారు. నామినేషన్లు చేయించేందుకు ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునేందుకు స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో టెక్నికల్ టీంలు కూడా ఏర్పాటుచేశారు. పాఠశాలల్లో ఐడియా బాక్స్లను ఏర్పాటు చేయాలని ఆదేశించినా ఆ దిశగా అడుగు ముందుకు పడలేదు. ప్రధానంగా సైన్స్ టీచర్లు ఎక్కువగా శ్రద్ధ వహిస్తే నామినేషన్లు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. హెచ్ఎంలు, టీచర్లలో కొంత నిర్లిప్తత కూడా కారణమని తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో మాత్రం డీఈఓ, సైన్స్ అధికారి ప్రత్యేక దృష్టిసారించడంతో నామినేషన్లు బాగా అయ్యాయని తెలుస్తోంది.
ఎంపికై తే ఒక్కో విద్యార్థి
నామినేషన్కు రూ.10 వేలు..
ఇన్స్పైర్ అవార్డుకు ప్రాజెక్టు రూపకల్పన చేసి వెబ్సైట్ ద్వారా పంపితే ఎంపికై న విద్యార్థికి రూ. 10వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. విద్యార్థి వినూత్న ఆవిష్కరణలకు సంబంధించి నమూనా రూపొందించేందుకు, ప్రయాణ ఖర్చులకు ఈ డబ్బులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. జిల్లాస్ధాయిలో ఇన్స్పైర్ అవార్డుల ప్రాజెక్టులకు సంబంధించిన నమూనా ప్రదర్శనలు వచ్చే ఏడాది నవంబర్లో నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయి ఇన్స్పైర్, ఇందులో ప్రతిభ కనబరిస్తే జాతీయస్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిస్తే జపాన్ వంటి దేశాల పర్యటనకు కూడా ఎంపిక చేస్తారు. అలా ఎంపికై న వారికి రూ.25వేల పారితోషికం కూడా అందజేస్తారు.
ఇన్స్పైర్ అవార్డులకు నామమాత్రంగానే నామినేషన్లు పంపారు. విద్యార్థుల్లోని ప్రతిభ వెలికితీసేందుకు ఒక చక్కటి వేదిక ఇన్స్పైర్ అవార్డు మనక్. అన్ని యాజమాన్యాల పాఠశాలలు తమ విద్యార్థులను ప్రోత్సహించాల్సిఉంటుంది. అందుకు ఒక ఐడియాతో ప్రాజెక్టుకు సంబంధించి సంక్షిప్తంగా వివరాలు పంపించాలి. హెచ్ఎంలు, టీచర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి సెప్టెంబర్ 15లోగా విద్యార్థులతో నామినేషన్లు పంపాలి. – ఎస్.శ్రీనివాసస్వామి, హనుమకొండ జిల్లా సైన్స్ అధికారి

ఇంకా ఇన్స్పైర్ కాలేదు!