
‘భూ భారతి’తో సమస్యలు పరిష్కారం
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారంతో పాటు భూమి హక్కు పట్టాలు రైతులు పొందుతారని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. మల్లంపల్లి మండలకేంద్రంలో సోమవారం నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో ధరణి పొరపాట్లను సవరించేందుకు కలెక్టర్లకు తప్ప ఏ అధికారికి అవకాశం లేకుండా పోయిందన్నారు. దీంతో తహసీల్దార్ స్థాయిలో వేల సంఖ్యలో దరఖాస్తులు పేరుకుపోయాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం భూ భారతి ద్వారా భూ సమస్యల పొరపాట్ల సవరణకు అవకాశం కల్పించిందని తెలిపారు. మ్యూటేషన్ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కారం అవుతాయని తెలిపారు. రెండింతల అప్పిల్ వ్యవస్థతో రైతులు భూ సమస్యలపై కోర్టు వరకు వెళ్లే అవసరం దాదాపుగా ఉండదని వివరించారు. గత చట్టానికి అనుగుణంగా మరో 14 నూతన అంశాలను పొందుపరిచారని తెలిపారు. ప్రతీ వ్యక్తికి గుర్తింపు కార్డు ఉన్న తరహాలో భూ భారతి చట్టం ద్వారా భూమి హక్కు పట్టాలు పొందుతారని వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ విజయభాస్కర్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర