సినిమాలకు సంబంధించిన వ్యక్తి.. ప్రభుత్వంలో ఉంటే పలు నిర్ణయాలు ఇండస్ట్రీకి కలిసొచ్చేలా ఉంటాయి. విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కోలీవుడ్కి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఇప్పుడు తమిళనాడులో ఆ ట్రెండ్ మొదలైంది. ఎన్నాళ్లుగానో లేని స్పెషల్ షోలకు అనుమతి లభించింది. త్రిష హీరోయిన్గా నటించిన మూవీతోనే దీనికి శ్రీకారం చుట్టడం విశేషం.
(ఇదీ చదవండి: టాలీవుడ్కి బిగ్షాక్.. ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది)
తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పరిశ్రమకు తొలిసారి ఊరట లభించింది. సూర్య, త్రిష జంటగా నటించిన 'కరుప్పు' మూవీకి మే 14,15 తేదీల్లో ఉదయం 9 గంటల స్పెషల్ షోలు ప్రదర్శించేందుకు విజయ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తమిళనాడులో చాన్నాళ్ల నుంచి స్పెషల్ షోలు లేవు. దీంతో ఈ నిర్ణయంపై నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్టర్స్.. సీఎం విజయ్కి థ్యాంక్స్ చెప్పింది. తెలుగులో ఈ చిత్రం 'వీరభద్రుడు' పేరిట రిలీజ్ కానుంది. విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమిళనాడులో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 2 వరకు రెండు రోజుల పాటు మొత్తం 5 షోలు వేయనున్నారు.
సూర్య,త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన 'కరుప్పు' సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించాడు. ట్రైలర్ అయితే పర్లేదనిపించేలా ఉంది. కోర్టులో సామాన్యులకు న్యాయం అందకుండా చేసే ఓ అవినీతి లాయర్ భరతం పట్టేందుకు దేవుడే దిగివస్తే ఏం జరిగింది అనే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గత రెండు మూడు సినిమాలతో బాగా డీలాపడిపోయిన సూర్య.. ఇది హిట్ అవ్వడం చాలా కీలకం. మరి ఏం చేస్తాడో చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్)


