విశ్వంభర గ్రాఫిక్స్‌ వర్క్‌పై 'బన్ని' నిర్మాత కామెంట్లు | Vasishta Father And Producer Satyanarayana Reddy Comments On Vishwambhara VFX Work | Sakshi
Sakshi News home page

విశ్వంభర గ్రాఫిక్స్‌ వర్క్‌పై 'బన్ని' నిర్మాత కామెంట్లు

Apr 13 2025 8:44 AM | Updated on Apr 13 2025 10:23 AM

Vasishta Father And Producer Satyanarayana Reddy Comments On Vishwambhara VFX Work

చిరంజీవి- వశిష్ఠ సినిమా విశ్వంభర గ్లింప్స్‌ విడుదల సమయంలో గ్రాఫిక్స్‌ వర్క్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే..   ఈ మూవీని  యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ ఖర్చుతో నిర్మిస్తోంది. దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం. టీజర్‌ విడుదల తర్వాత గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోవడంతో భారీగా ట్రోల్స్‌ వచ్చాయి. దీంతో ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా  ఆలస్యం అవుతూ వస్తోంది.  అయతే, తాజాగా విశ్వంభర గ్రాఫిక్స్‌ గురించి వశిష్ఠ తండ్రి సత్యనారాయణ రెడ్డి మల్లిడి పలు వ్యాఖ్యలు చేశారు.

దర్శకుడు వశిష్ఠ అసలు పేరు మల్లిడి వెంకట నారాయణ రెడ్డి అని తెలిసిందే.. ఆయన తండ్రి నిర్మాతగా టాలీవుడ్‌లో ఢీ (మంచు విష్ణు), బన్ని (అల్లు అర్జున్‌), భగీరథ (రవితేజ) వంటి చిత్రాలు నిర్మించారు. అయితే, తాజాగా వశిష్ఠ తండ్రి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విశ్వంభర గ్రాఫిక్స్‌ వర్క్‌ గురించి ఇలా చెప్పుకొచ్చారు. 'విశ్వంభర సినిమా షూటింగ్‌ కొంత పూర్తి అయిన తర్వాత గ్రాఫిక్స్‌ కోసం ఫుటేజ్‌ ఇచ్చారు. వీఎఫ్‌ఎక్స్‌ టీమ్‌ వారు మూడు నెలల్లోనే పూర్తి చేసి ఇస్తాం అన్నారు. కానీ, పెద్ద సినిమా కావడంతో ఆరు నెలలు టైమ్‌ తీసుకోమని మేకర్స్‌ సూచించారు. అలా లెక్కలు వేసుకుని 2025 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు తేదీ ప్రకటించారు. కానీ, తొమ్మిది నెలలు గడిచినా వారు గ్రాఫిక్స్‌ పని పూర్తి చేయలేకపోయారు. 

విడుదల తేదీ దగ్గరకు రావడంతో అలా టీజర్‌ను వదిలారు. ఆర్టిఫిషయల్‌ టెక్నాలజీ ఉపయోగించుకుని టీజర్‌ను క్రియేట్‌ చేశారు. అది గ్రాఫిక్స్‌ వర్క్‌ ఏంత మాత్రం కాదు. ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో గ్రాఫిక్స్‌ టీమ్‌లో భయం మొదలైంది. తర్వాత VFX నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. త్వరలో విశ్వంభర నుంచి మరో టీజర్‌తో పాటు ట్రైలర్‌ రావచ్చు. అందులో అసలైన  వీఎఫ్‌ఎక్స్‌ పనితీరు ఎలా ఉందో మీరందరూ చూస్తారు. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.' అని ఆయన అన్నారు.

విశ్వంభర టీజర్‌ విడుదల కాగానే మెగాస్టార్‌ అభిమానులు కూడా.. VFX వర్క్‌ బాగాలేదని విమర్శించారు. హాలీవుడ్ చిత్రాల నుండి సన్నివేశాలను కాపీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. దెయ్యాల కోట చూపిస్తున్నారా అంటూ..  పాన్‌ ఇండియా రేంజ్‌ సినిమా అంటే ఎలా ఉండాలని తప్పబట్టారు. నాసిరకమైన విజువల్స్, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ అంటూ ట్రోలింగ్ చేశారు. దీంతో విశ్వంభర విడుదలను వాయిదా వేశారు. ఫ్యాన్స్‌ కూడా వాయిదా పడటమే బెటర్ అని అనుకున్నారు. ఆ తప్పులు అన్నీ సరిచేసుకుని జులై 24న థియేటర్లలోకి విశ్వంభర రానున్నట్లు సమాచారం.

 

Advertisement
 
Advertisement
Advertisement