
2025 నేటితో సగం పూర్తయింది. అయితే ఈ ప్రథమార్ధంలో వచ్చిన స్టార్ హీరోల చిత్రాల సంఖ్య తక్కువే. కానీ ద్వితీయార్ధం ధూమ్ ధామ్గా ఉండబోతోంది. పలువురు స్టార్స్ వెండితెరపైకి దూసుకు రావడానికి రెడీ అయ్యారు. సో... 2025 సెకండాఫ్ హీరోల అభిమానులకు పండగే. అలాగే హీరోయిన్ల ఫ్యాన్స్కి కూడా. ‘ముందుంది మస్త్ మజా’ అంటూ థియేటర్లకు రానున్న ఆ చిత్రాల గురించి...
ఈ ఏడాదే విశ్వంభర
ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘విశ్వంభర’ వాయిదా పడింది. చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్ ఇది. త్రిష హీరోయిన్గా నటించగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ లీడ్ రోల్స్లో నటించారు. ఈ చిత్రంలో ఆంజనేయస్వామి భక్తుడు దొరబాబుపాత్రలో చిరంజీవి కనిపిస్తారని, ‘విశ్వంభర’ అనే పుస్తకం, ‘విశ్వంభర’ ప్రపంచం సినిమాలో కీలకంగా ఉంటాయని తెలిసింది. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్స్తో యూనిట్ బిజీగా ఉంది. ‘విశ్వంభర’ ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.
అఖండ తాండవం
హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రానున్న తాజా చిత్రం ‘అఖండ 2’. 2021లో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్గా ‘అఖండ 2: తాండవం’ తెరకెక్కుతోంది. సంయుక్త ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారని టీజర్ స్పష్టం చేస్తోంది. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.
సైమన్ ఈజ్ కమింగ్
ధనుష్తో కలిసి ‘కుబేర’ సినిమాతో థియేటర్స్లోకి వచ్చారు నాగార్జున. శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని ఈ మూవీలో నాగార్జున చేసిన లీడ్ రోల్ ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈసారి అంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉండే రోల్ని నాగార్జున ‘కూలీ’లో చేశారు. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సైమన్ అనే పవర్ఫుల్ విలన్పాత్రలో నాగార్జున కనిపిస్తారు. నాగార్జున పూర్తి స్థాయి విలన్గా కనిపించనున్న ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది.
ఇటు వీరమల్లు... అటు ఓజీ
పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు, ఓజీ’... ఈ రెండు సినిమాలూ ఈ ఏడాదే విడుదల కాన్నాయి. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ‘హరిహర వీరమల్లు’ రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’గా జూలై 24న విడుదల కానుంది. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధీ అగర్వాల్ హీరోయిన్. ఏయం రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ రావు నిర్మించారు. ఇక పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘ఓజీ’. ఇందులో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్. ఈ గ్యాంగ్స్టర్ సినిమాను సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 25న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
పోలీసాఫీసర్ లక్ష్మణ్ భేరీ
రవితేజ పోలీసాఫీసర్గా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లక్ష్మణ్ భేరీ అనే పవర్ఫుల్పోలీసాఫీసర్పాత్రలో రవితేజ కనిపిస్తారు. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఇది. షూటింగ్ దాదాపు పూర్తయింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది.
రాజా సాబ్ రెడీ
విష్ణు మంచు టైటిల్ రోల్ చేసిన ‘కన్నప్ప’ సినిమాలో రుద్రగా కనిపించి ప్రేక్షకులను అలరించారు ప్రభాస్. కాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజాసాబ్’ డిసెంబరు 5న విడుదల కానుంది. ఈ హారర్ కామెడీ యాక్షన్ సినిమాను మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దికుమార్ హీరోయిన్లు. తాతా మనవళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ తాతగా సంజయ్ దత్ కనిపిస్తారు.
ఆంధ్రా కింగ్ తాలూకా...
ఓ సినిమా హీరోకి, ఆ హీరో ఫ్యాన్కి మధ్యలో జరిగే సంఘటనలతో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా రూపొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరో అభిమానిగా రామ్, సినిమా స్టార్ సూర్యకుమార్గా ఉపేంద్ర కనిపిస్తారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. పి. మహేశ్బాబు దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ రాజమండ్రిలో ఆరంభమైంది. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో స్పష్టత రానుంది.
సెంటిమెంటల్ తమ్ముడు
ఈ ఏడాది మార్చిలో నితిన్ నుంచి ‘రాబిన్హుడ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూలైలో ‘తమ్ముడు’ సినిమాతో మరోసారి వస్తున్నారు నితిన్. అక్కా తమ్ముడు సెంటిమెంట్తో వస్తున్న ఈ సినిమాలో సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, లయ కీలకపాత్రధారులు. లయ తమ్ముడిపాత్రలో నితిన్ కనిపిస్తారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది.
త్వరలో కింగ్డమ్
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్పై మేకర్స్ నుంచి ఇంకా స్పష్టత రాలేదు కానీ జూలై చివర్లో లేదా ఆగస్టులో ‘కింగ్డమ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. అంతేకాదు... ఈ సినిమా రెండు డిఫరెంట్ టైమ్లైన్స్లో సాగుతుందని టాక్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
ప్రేమికులు క్రైమ్ చేయాల్సి వస్తే!
ఈ ఏడాది మే 1న నాని హీరోగా చేసిన ‘హిట్ 3’ సినిమాలో అడవి శేష్ గెస్ట్ రోల్ చేశారు. ఇక ఆయన సోలో హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్: ఏ లవ్స్టోరీ’ డిసెంబరు 25న రిలీజ్ కానుంది. ఈ క్రైమ్ లవ్స్టోరీ థ్రిల్లర్ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, అనురాగ్ కశ్యప్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. బ్రేకప్ చేప్పుకున్న ప్రేమికులు కలిసి ఓ క్రైమ్ చేయాల్సి వస్తే ఏం జరుగుతుంది? అన్నదే ఈ సినిమా కథనం అని తెలిసింది. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమాకు సునీల్ నారంగ్ సహ–నిర్మాత.
కిష్కింధపురిలో...
బెల్లకొండ సాయిశ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. అలాగే లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో ‘హైంధవ’, సాగర్కె. చంద్ర దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’ సినిమాలు కూడా చేస్తున్నారు సాయిశ్రీనివాస్. ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒక చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.
సోషియో ఫ్యాంటసీ ‘స్వయంభూ’
నిఖిల్ హీరోగా నటిస్తున్నపాన్–ఇండియా మూవీ ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రంలో నిఖిల్ ఒక యోధుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేశ్ హీరోయిన్లు. ఇందులో హీరో మాత్రమే కాదు... హీరోయిన్లు కూడా యాక్షన్ సన్నివేశాల్లో కనిపిస్తారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.
లవ్స్టోరీ తెలుసు కదా
ఈ ఏడాది వేసవిలో ‘జాక్’ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ థియేటర్స్కి వచ్చారు. ఇక ఈ దీపావళికి ‘తెలుసు కదా’ అనే లవ్స్టోరీతో రానున్నారు సిద్ధు. స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 17న రిలీజ్ కానుంది. ముక్కోణపు ప్రేమకథగా ‘తెలుసు కదా’ ఉంటుందట.
ఏటిగట్టు సంబరాలు
సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ ‘సంబరాల ఏటిగట్టు’. రాయలసీమ బ్యాక్డ్రాప్లో రోహిత్ కేపీ దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఐశ్వర్యా లక్ష్మి, అనన్య నాగళ్ల, శ్రీకాంత్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ 75 శాతం పూర్తయింది. ఈ సినిమా సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.
మిరాయ్ అడ్వెంచర్
‘హను–మాన్’ వంటి సక్సెస్ఫుల్ చిత్రం తర్వాత హీరో తేజ సజ్జా నటిస్తున్న అడ్వెంచరస్ యాక్షన్ మూవీ ‘మిరాయ్’. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్. మంచు మనోజ్ విలన్గా చేస్తున్నారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది.
ఇంకా నవీన్చంద్ర ‘షో టైమ్’, ఆది సాయికుమార్ ‘శంబాల’, సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ’తోపాటు పలు మీడియమ్, స్మాల్ బడ్జెట్ చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి.
ఉమన్ పవర్
ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలు వరుసగా విడుదలవుతుంటే... స్టార్ హీరోయిన్ల చిత్రాలూ దూసుకు వస్తున్నాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో తమ పవర్ చూపించడానికి అనుష్క, లావణ్యా త్రిపాఠి, రష్మికా మందన్నా వంటి తారలు రెడీ అయ్యారు.
⇒ పగ, ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైన ఓ బాధిత గిరిజన మహిళ నేర ప్రపంచంలోకి అడుగుపెట్టి, లెజెండ్గా ఎలా ఎదిగింది? అనే కథాంశంతో అనుష్క ‘ఘాటీ’ రూపొందింది. క్రిష్ దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో జూలై 11న విడుదల కానుంది. ఈ చిత్రంలో తమిళ హీరో విక్రమ్ ప్రభు లీడ్ రోల్ చేశారు.
⇒ కుటుంబ బంధాలను నిలపడానికి సతీ లీలావతి ఏం చేసింది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘సతీ లీలావతి’. లావణ్యా త్రిపాఠి టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రంలో దేవ్ మోహన్ ఆమె భర్తపాత్ర చేశారు. భార్యాభర్తల అనుబంధాన్ని ఎమోషనల్గా, ఎంటర్టైనింగ్గా చూపిస్తూ, తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో నాగమోహన్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. .
⇒ స్టార్ హీరోల చిత్రాల్లోనూ గుర్తింపు తెచ్చుకునేపాత్రలు చేస్తూ దూసుకెళుతున్న రష్మికా మందన్నా నటించిన తొలి ఉమన్ సెంట్రిక్ మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి ఓ లీడ్ రోల్ చేశారు. ఈ ప్రేమకథా చిత్రంలో క్లిష్టమైన రిలేషన్షిప్ని ఎదుర్కొనే కాలేజీ విద్యార్థినిగా రష్మిక నటించారు. ఇక ఇది కాకుండా ‘మైసా’ అనే మరో ఫిమేల్ సెంట్రిక్ మూవీ కూడా రష్మిక డైరీలో ఉంది.
⇒ అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘పరదా’. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, పీవీ శ్రీనివాసులు, శ్రీధర్ మక్కువ ఈ సినిమాను నిర్మించారు. మూఢ నమ్మకాలు, మహిళా సాధికారిత వంటి అంశాలతో రూపొందిన ‘పరదా’ ఈ ఏడాదే రిలీజ్ కానుంది.
⇒ ఇంకా కీర్తీ సురేష్ ‘రివాల్వర్ రీటా’ అంటూ టైటిల్ రోల్లో ఆగస్ట్ 27న థియేటర్స్కు రానున్నారు. జేకే చంద్రు దర్శకత్వంలో రూపొందిన ఈ తమిళ చిత్రం తెలుగులోనూ రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది. అలాగే వరలక్ష్మిపోలీసాఫీసర్గా నటించిన ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో సింగపూర్ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంకా మరికొందరు నాయికలు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో తమ పవర్ని నిరూపించుకోనున్నారు.
కన్యారాశి టైమ్ వచ్చింది
హిట్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’ (2018)కి సీక్వెల్గా ‘ఈఎన్ఈ రిపీట్’ సినిమా రానుంది. ‘ఏలినాటి శనిపోయింది.. కన్యారాశి టైమ్ వచ్చింది’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. తొలి భాగంలో నటించిన విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను సీక్వెల్లోనూ నటించనున్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ సీక్వెల్కు దర్శకత్వం వహించనున్నారు. డి. సురేష్బాబు, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్.
ఫీల్గుడ్ లవ్స్టోరీ
నరేశ్ అగస్త్య హీరోగా విపిన్ దర్శకత్వంలో ఉమా దేవి కోట నిర్మించిన చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’. ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాలో రబియా ఖతూన్ కథానాయికగా నటించారు. ఈ సినిమాను జూలై 17న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘ఫీల్గుడ్ లవ్స్టోరీతో రూపొందించిన ఈ చిత్రంలో మ్యూజిక్కి మంచి స్కోప్ ఉంది. జస్టిన్ ప్రభాకరన్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఈ చిత్రం మంచి అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది.