ఈ ఏడాది బోలెడు సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. ఈ ట్రెండ్ను కొనసాగిస్తూ, కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ జనవరి 1న నువ్వు నాకు నచ్చావ్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రం 2001 సెప్టెంబర్ 1న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది.
అదీ నా పరిస్థితి!
ఈ చిత్రానికి కథ, మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన సినిమా రిలీజైనరోజు పడ్డ టెన్షన్ గురించి ఓపెనయ్యాడు. నువ్వు నాకు నచ్చావ్ మొదటిరోజు టాక్ విని భీమవరం వెళ్లిపోయాను. సంతాపసభలో ఉన్నోడిలా ఉంది నా పరిస్థితి!
అమ్మ ఒడిలో తలపెట్టుకుని
సినిమా చూసి బయటకు వచ్చాక ఎలా ఉందని ఓ వ్యక్తిని రివ్యూ అడిగా.. అతడు రెండు, మూడు వారాలు ఆడుతుందంతే అన్నాడు. నేను చాలా బాధపడ్డాను. ఇంటికెళ్లి మా అమ్మ ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాను. ఈ సినిమాలకు నేను పనికిరానేమో.. నువ్వు అన్నట్లుగానే నేను ఈ ఇండస్ట్రీకి వచ్చి తప్పు చేశాను. ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బాగుండేదన్నాను. మా అమ్మ బెంబేలెత్తిపోయింది.
చెమటతో ఒళ్లు తడిచింది
కట్ చేస్తే నిర్మాత స్రవంతి రవికిషోర్ ఫోన్ చేసి హైదరాబాద్కు రమ్మన్నారు. నన్ను శాంతి థియేటర్కు తీసుకెళ్లారు. నాకు చెమట్లతో ఒళ్లు తడిచిపోయింది. అక్కడ టికెట్లు తెగుతుంటే అప్పుడు ధైర్యం వచ్చింది అని చెప్పుకొచ్చాడు. అయితే సినిమాకు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చిందని, త్రివిక్రమ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: 2025లో హీరోలు కనిపించలేదు!


