
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత వేదరాజు టింబర్ (54) (Vedaraju Timber) కన్నుమూశారు. గతంలో ఆయన నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించడమే కాకుండా కనస్ట్రక్షన్ రంగంలో కూడా రాణించారు. అయితే, కొంత కాలంగా సినిమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వేదరాజు కొన్ని నెలల క్రితం చికిత్స కోసం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. కానీ, ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో శుక్రవారం ఉదయం మరణించారు.
కొంత కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆయన కనస్ట్రక్షన్ రంగంలో బిజీగా ఉన్నారు. మళ్లీ చిత్ర రంగంలో రీఎంట్రీ ఇద్దాం అనే ఆలోచనలతో ఇప్పటికే పలు కథలను కూడా ఆయన రెడీ చేసుకున్నారు. వేదరాజు టింబర్ నెక్ట్స్ ప్రొడక్షన్ పేరుతో టీమ్ను కూడా రెడీ చేసుకున్నారు. అయితే, ఇంతలో ఇలా జరుగడంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
హీరో అల్లరి నరేష్తో ‘మడత కాజా’ చిత్రంతో పాటు 'సంఘర్షణ' అనే మరోసినిమాను ఆయన నిర్మించారు. వేదరాజుకు భార్య, కూతురు ఉన్నారు. ఆయన మృతి పట్ల సన్నిహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం సాయింత్రం జరగనున్నాయని కుటుంబసభ్యులు తెలిపారు.