
గ్రామీణ ప్రేక్షకులు థియేటర్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు
మలికిపురం: తన తదుపరి చిత్రం ‘గ్లోబల్ స్టార్’ రామ్చరణ్తో ఉంటుందని ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో స్వగ్రామమైన మట్టపర్రుకు కుటుంబ సమేతంగా మంగళవారం ఆయన విచ్చేశారు. గ్రామస్తులు, చిన్ననాటి స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... హీరో రామ్చరణ్తో సినిమా తీసేందుకు కథ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.
షూటింగ్ ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు. తామిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచిందని, ఆ తరువాత ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్థాయికి రామ్చరణ్ ఎదిగారన్నారు. ఆయనతో తాను చేయబోయే చిత్రం ఆ స్థాయిలోనే ఉంటుందని తెలిపారు. అల్లు అర్జున్తో తీసిన ‘పుష్ప’ జాతీయ స్థాయిలో తనకు గుర్తింపు తెచ్చిందన్నారు. పుష్ప–1కు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి రెండో భాగాన్ని మరింత ఫోకస్ పెట్టి తీశామన్నారు.

స్వగ్రామం మట్టపర్రులోని తన ఇంట్లో చిన్నారితో ముచ్చటిస్తున్న దర్శకుడు సుకుమార్
ప్రేక్షకుల అభిరుచి ఏం మారలేదు
సినిమాపై ప్రేక్షకుల అభిరుచి ఏ మాత్రం మారలేదని, అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉందని సుకుమార్ పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రేక్షకులు థియేటర్లను బాగా ఆదరిస్తున్నారని చెప్పారు. పట్టణ ప్రేక్షకుల్లో కొంత భాగం ఓటీటీ ప్లాట్ఫామ్స్ పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. టాలెంట్ ఉన్నవారు చాలా మంది ఉన్నారని, అలాంటి వారిని ప్రోత్సహించేందుకు సుకుమార్ రైటింగ్స్ వంటి సంస్థల్ని స్థాపించానన్నారు. ఈ సంస్థల ద్వారా చాలామందికి ప్రోత్సాహం, టాలెంట్ను ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కుతుందన్నారు. ఆ దిశగానే ఫలితాలు ఉంటున్నాయని చెప్పారు.
పుట్టిన ఊరంటే అందరికీ మమకారమే
రెండేళ్లకు పైగా చాలా బిజీ షెడ్యూల్స్లో ఇరుక్కుపోయానని, షూటింగ్స్ నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల స్వగ్రామానికి రాలేకపోయానని సుకుమార్ చెప్పారు. లేదంటే ఏటా సంక్రాంతి పండుగను ఇక్కడే చేసుకునే వాళ్లమన్నారు. ఇకపైనా ఏటా ఇదే సంప్రదాయం కొనసాగిస్తానన్నారు. పుట్టిన ఊరంటే అందరికీ మమకారమే అన్నారు. కోనసీమలో గోదారి గట్లూ.. కాలువ చెంత, పొలాల మధ్య స్నేహితులతో తిరిగిన క్షణాలు, కాలేజీ రోజులు చాలా బాగుంటాయన్నారు.