సత్యవతి అలియాస్ ప్రముఖ సింగర్ మంగ్లీ పేరుతో కోట్ల మోసం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు మంగ్లీ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి కోట్లు వసూలు చేశారని సమాచారం. ఇందుకు సంబంధించి ఓ లాయర్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించగా.. ఈ కేసులో మంగ్లీ తమ్ముడు శివ కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కామ్లో ఏకంగా రూ.150 కోట్ల మేర క్రిప్టో కరెన్సీ ఉన్నట్లు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడీ విషయమై స్వయంగా మంగ్లీనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
(ఇదీ చదవండి: రికార్డులు బ్రేక్ చేసినా 'పుష్ప2'ని దాటలేకపోయింది)
'మైక్రో ఫైనాన్స్ పేరిట నా పేరుతో కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని వస్తున్న వార్తలని ఖండిస్తున్నాను. నాకు ఆ వ్యక్తులకు, వాళ్లకు సంబంధించిన ఫైనాన్స్ వ్యాపారాలకు ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం నన్ను, నా తమ్ముడిని రోజూ చాలామంది సంప్రదిస్తుంటారు. ఆ ఈవెంట్కి సంబంధించిన ఇన్విటేషన్ వివరాలవరకే గానీ, వాళ్ల వ్యక్తిగత వ్యాపారాల గురించి నాకు, నా కుటుంబ సభ్యులకు ఏ మాత్రం సంబంధం లేని విషయం. ఇలాంటి మోసపూరిత విషయాల్లో నా పేరుని వాడుకోవడం, నన్ను ఇన్వాల్వ్ చేయడం చాలా అన్యాయం'
'కావాలని కొందరు నా వ్యక్తిగత పేరు, ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న కరెన్సీకి సంబంధించిన వీడియోలని, మా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ మినహా నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. దయచేసి నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేసినా మీరు నమ్మొద్దు. అలా మోసపోయిన వారికి న్యాయం చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతున్నాను' అని మంగ్లీ పోస్ట్ పెట్టింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు)


