ఫాంహౌజ్‌లో పార్టీ చేసుకున్నాం: శ్రద్ధ | Shraddha Kapoor Reportedly Admits Partying With Sushant Singh Rajput | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసు: శ్రద్ధా కపూర్‌ కీలక వ్యాఖ్యలు!

Sep 26 2020 8:26 PM | Updated on Sep 26 2020 8:39 PM

Shraddha Kapoor Reportedly Admits Partying With Sushant Singh Rajput - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ వ్యవహారంలో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌ నేడు ఎన్‌సీబీ ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గెస్ట్‌హౌజ్‌లో దీపికను, కార్యాలయంలో శ్రద్ధ, సారాలను విచారిస్తున్న అధికారులు వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌ ఫాంహౌజ్‌లో జరిగే పార్టీల గురించి శ్రద్ధా కపూర్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.(చదవండి: కీలక విషయాలు వెల్లడించిన దీపిక మేనేజర్‌!)

ఇందుకు సమాధానంగా.. ‘‘చిచోరే’’ సినిమా సమయంలో సుశాంత్‌ పవనా ఫాంహౌజ్‌కు వెళ్లానని శ్రద్ధ చెప్పినట్లు సమాచారం. ‘‘ఆరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మేం అక్కడికి చేరుకున్నాం. భోజనం చేసిన తర్వాత బోటులో పార్టీ చేసుకున్నాం. అర్ధరాత్రి దాటేంత వరకు అందరూ పార్టీలోనే ఉన్నారు. పాటలు వింటూ ఎంజాయ్‌ చేశాం. అయితే నేను ఎలాంటి డ్రగ్స్‌ తీసుకోలేదు’’అని శ్రద్ధ బదులిచ్చినట్లు ఓ జాతీయ మీడియా కథనం వెలువరించింది. అదే విధంగా సుశాంత్‌ గురించి ఆమె పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు పేర్కొంది. షూటింగ్‌ సమయంలో అతడు తన వానిటీ వాన్‌లో మత్తు పదార్థాలు సేవించడం చూశానని చెప్పినట్లు తెలిపింది.(చదవండి: ఎన్‌సీబీ రకుల్‌ విచారణలో ఏం చెప్పింది?)

కాగా సుశాంత్‌ టాలెంట్‌ మేనేజర్‌ జయ సాహాతో జరిపిన వాట్సాప్‌ చాట్‌ గురించి ప్రశ్నించగా, శ్రద్ధ సమాధానం దాట వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటికే ఎన్‌సీబీ ఎదుట హాజరైన మరో హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. రియా చక్రవర్తితో తాను చాట్‌ చేసిన మాట వాస్తవేమనని, అయితే తానెన్నడూ డ్రగ్స్‌ తీసుకోలేదని వెల్లడించినట్లు వార్తలు వెలువడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement