
అలనాటి నటి విజయభాను (68) ఇక లేరు. అమెరికాలో స్థిరపడిన ఆమె ఏప్రిల్ నెలలో భారత్కు వచ్చారు. అయితే, అదే నెల 24న తీవ్రమైన ఎండల వల్ల ఆమెకు వడదెబ్బ సోకడంతో మరణించారు. ఆమె ఆకస్మిక మృతి పట్ల జయప్రద, సుమన్తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. తాజాగా నటి విజయభాను(Vijaya Bhanu) గురించి తన సోదరి డా. సింధూరి అమెరికా నుంచే పలు విషయాలను పంచుకున్నారు. ' మా అక్క ప్రేరణ వల్ల నేను కూడా అమెరికా వచ్చి స్థిరపడ్డాను. చాలామందికి ఆమె సాయం చేశారు. ఆమె జీవితం చాలామందికి స్ఫూర్తిదాయకమైనది. అందుకే ఆమె జీవితంపై ఒక పుస్తకం రచించాలని కోరుకుంటున్నాను. జయప్రద అంటే మా అక్కకు చాలా ఇష్టం. చెన్నైలో జరిగిన మా అక్క దశదినకర్మకు కూడా ఆమె హాజరయ్యారు. భారత గడ్డపైనే తనువు చాలించాలని మా అక్కకు ఉన్న చివరి కోరిక.. ఇలా అనుకోకుండానే ఆమె ఆకాంక్ష తీరింది. కానీ, ఆమె లేని లోటు మాకు ఎవరూ పూడ్చలేరు.' అని ఆమె చెప్పుకొచ్చారు.
అనంతపురం జిల్లాకు చెందిన విజయభాను సినిమా ఛాన్సుల కోసం చెన్నైకి వెళ్లి తన సత్తా చాటారు. 70వ దశకంలో అప్పటి టాప్ హీరోల సినిమాల్లో నటించారు. ఆరోజుల్లో రాజబాబు - విజయభాను జంటకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. సుమారు వందకు పైగా సినిమాల్లో నటించిన విజయభాను కెరీర్ టాప్లో ఉన్న సమయంలోనే ఒక అమెరికన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అమెరికాఓ స్థిరపడ్డారు. లాస్ ఏంజెల్స్ లో 'శ్రీ శక్తి శారదా నృత్యనికేతన్' పేరుతో నృత్య కళాశాల స్థ్థాపించిన ఆమె వేలాది మందికి శిక్షణ ఇచ్చారు. అమెరికాలో ఏదైనా సాయం కోసం వెళ్లిన తెలుగు వారికి ఆమె ఎంతో అండగా నిలబడ్డారని చెప్పుకుంటారు.
1979లో విడుదలైన 'ఇది కథ కాదు' సినిమాకు గాను ఆమెకు నంది అవార్డు దక్కింది. చిరంజీవి, కమల్ హాసన్, జయసుధలతో కలిసి పోటీపడి ఆమె నటించారు. కె. బాలచందర్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇందులో నటించిన జయసుధకు ఉత్తమ నటిగా నంది అవార్డు దక్కగా.. ఉత్తమ సహాయ నటిగా విజయభానుకు దక్కింది. ఎన్టీఆర్ నటించిన నిప్పులాంటి మనిషి చిత్రంలో కూడా ఆమె మెప్పించారు.