హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. మెగా హీరో వరుణ్ తేజ్ని 2023లో పెళ్లి చేసుకున్న తర్వాత మెగా కోడలు అయిపోయింది. గతేడాది వీళ్లకు కొడుకు కూడా పుట్టాడు. పెళ్లికి ముందే ఓ సినిమాని లావణ్య పూర్తి చేయగా అది వాయిదాలు పడుతూ ఈ నెల ప్రారంభ వారంలో వచ్చింది. దీన్ని జనాలు కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం రెండు వారాలైనా కాకముందే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.
(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)
లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్, మడోన్నా సెబాస్టియర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'సతీ లీలావతి'. తాతినేని సత్య దర్శకుడు. ప్రేమ, పెళ్లి, విడాకుల తదితర అంశాలతో తీసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఈ నెల 8వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. కంటెంట్ బాగోలేకపోవడంతో ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం(మే 20) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్కి రెడీ అయింది. అంటే రిలీజైన 12 రోజులకే తీసుకొచ్చేస్తున్నారనమాట. తెలుగు, తమిళ వెర్షన్స్ అందుబాటులోకి రానున్నాయి.
'సతీ లీలావతి' విషయానికొస్తే.. లీలావతి (లావణ్య త్రిపాఠి) స్టార్ డైరెక్టర్. తల్లిదండ్రుల గొడవల కారణంగా చిన్నప్పటి నుంచి ఈమెలో ఓ రకమైన భయం ఏర్పడిపోతుంది. దీని నుంచి బయటపడేందుకు సైకాలజిస్ట్ రామ్ సేతు (దేవ్ మోహన్) ఈమెకు సాయం చేస్తాడు. అలా ప్రేమలో పడి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు. కానీ వివాహమైన మూడేళ్లకు తనకు విడాకులివ్వాలని లీలావతిని సేతు అడుగుతాడు. నర్స్ నికోలా(మడోన్నా సెబాస్టియర్)తో ప్రేమలో ఉన్నానని.. విడాకులిస్తే ఆమెనే వివాహమాడతానని చెప్తాడు.
భర్త ప్రేమ వ్యవహారం తెలిసిన లీలావతి.. సేతుని కొట్టి ఇంట్లో బంధిస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు సేతు బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఈ కథలో లాయర్ తమలపాకుల (వీటీవీ గణేశ్), నిర్మాత మెట్ట రాజన్ (మెట్ట రాజేంద్రన్), దొంగ (సప్తగిరి) పాత్రల సంగతేంటి? చివరకు లీలావతి - సేతు విడిపోయారా? ఒక్కటయ్యారా? అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)


