శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్‌రాజు | Sandhya Theatre Stampede: Dil Raju Visited Sritej | Sakshi
Sakshi News home page

Dil Raju: నిలకడగా శ్రీతేజ్‌ ఆరోగ్యం.. సీఎం రేవంత్‌ను, అల్లు అర్జున్‌ను కలుస్తా!

Dec 24 2024 5:00 PM | Updated on Dec 24 2024 6:20 PM

Sandhya Theatre Stampede: Dil Raju Visited Sritej

సాక్షి, హైదరాబాద్‌: సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్‌ను నిర్మాత, టీఎఫ్‌డీసీ (Telangana Film Development Corporation)  చైర్మన్‌ దిల్‌రాజు (Dil Raju) మంగళవారం పరామర్శించారు. ప్రస్తుతం శ్రీ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని, రేవతి కుటుంబానికి అన్నిరకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 

 సీఎంను కలుస్తాం
రేవతి భర్త భాస్కర్‌కు సినీ ఇండస్ట్రీలో శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. అమెరికా నుంచి రాగానే  సీఎం  రేవంత్‌ను కలిసి భాస్కర్‌ కుటుంబానికి ఏం చేయాలనేది చర్చించామన్నారు. సినీ పరిశ్రమ పెద్దలందరం కలిసి సీఎంని రెండు రోజుల్లో కలుస్తామని, ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడతామన్నారు. అలాగే అల్లు అర్జున్‌ (Allu Arjun)ను కూడా కలుస్తానని తెలిపారు. సినీ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటానని స్పష్టం చేశాడు.

శ్రీతేజ్‌ కళ్ళు తెరుస్తున్నాడు
శ్రీ తేజ్ తండ్రి భాస్కర్ మాట్లాడుతూ.. నా కుమారుడు శ్రీతేజ్‌ 20 రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నాడు. 48 గంటల క్రితం వెంటిలేటర్ తీసేశారు. కొంత స్పర్శ ఉంది, కళ్ళు తెరుస్తున్నాడు. శ్రీ తేజ్ కోలుకోవడానికి టైం పట్టే అవకాశం ఉంది. అల్లు అర్జున్ మనుషులు, సుకుమార్ ఫ్యామిలీ కూడా ప్రతిరోజూ శ్రీ తేజ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. మా వల్ల హీరో అరెస్ట్ అవుతున్నాడని తెలిసి ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వచ్చి భరోసా ఇచ్చారు. అల్లు అర్జున్ రూ.25 లక్షలు ప్రకటించారు, కానీ మాకు రూ.10 లక్షలే అందింది. మైత్రీ మూవీస్‌ నిర్మాణ సంస్థవారు రూ.50 లక్షలు ఇచ్చారు అని తెలిపారు.

ఏం జరిగింది?
కాగా డిసెంబర్‌ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2 (Pushpa 2 Movie) ప్రీమియర్స్‌ ఏర్పాటు చేయగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు 20 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు థియేటర్‌ సిబ్బందితో పాటు అల్లు అర్జున్‌, అతడి టీమ్‌పైనా కేసు నమోదు చేశారు.

చదవండి: సంధ్య థియేటర్‌ ఘటన.. అల్లు అర్జున్‌ను ఎన్నిగంటలు ప్రశ్నించారంటే?

Advertisement
 
Advertisement
Advertisement