
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సాయి పల్లవి నార్త్లోనూ సత్తా చాటాలనుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా సాయిపల్లవి హిందీ చిత్రాలు ‘ఏక్ దిన్’, ‘రామాయణ’లకు సైన్ చేశారు. తాజాగా ‘ఏక్ దిన్’ సినిమా విడుదల తేదీ ఖరారైందని, ఈ చిత్రం ఈ నవంబరు 7న విడుదల కానుందని తెలిసింది. సాయి పల్లవి కెరీర్లోని ఈ తొలి హిందీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించారు. సునీల్ పాండే దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘జానే తూ... యా జానే నా’ (2008) సినిమా తర్వాత ఆమిర్ ఖాన్, మన్సూర్ కలిసి 17 సంవత్సరాల తర్వాత నిర్మించిన చిత్రం ‘ఏక్ దిన్’ కావడం విశేషం. ఒకరితో ఒకరికి పరిచయం లేని ఓ అబ్బాయి, ఓ అమ్మాయి ఓ విచిత్రమైన పరిస్థితుల్లో కలుసుకుంటారు. ఆ ఒక్క రోజు తర్వాత వారి జీవితాలు ఏ విధంగా మారిపోయాయి? అన్నదే ‘ఏక్ దిన్’ సినిమా కథాంశమని సమాచారం. మరోవైపు నితీష్ తివారి ‘రామాయణ’ సినిమాలో సీతగా నటిస్తున్నారు సాయి పల్లవి. రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానున్నాయి.