ప్రభాస్ ది రాజాసాబ్ తర్వాత దర్శకుడు మారుతి ఇప్పటి వరకు తన ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కాస్తా గ్యాప్ ఇచ్చారు. గతేడాది డిసెంబర్లో వచ్చిన ది రాజాసాబ్ రెబల్ స్టార్ అభిమానులను నిరాశపర్చిన సంగతి తెలిసిందే. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనేది టాలీవుడ్లో చర్చ మొదలైంది.
ప్రస్తుతం మారుతి తన నెక్ట్స్ ప్రాజెక్ట్పై దృష్టి పెట్టినట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. తన తర్వాత మూవీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో ప్లాన్ చేస్తున్నారని లేటేస్ట్ టాక్. వరుణ్ హీరోగా ఓ కొత్త కథను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ది రాజాసాబ్ తర్వాత మారుతి తెరకెక్కిస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
కాగా.. వరుణ్ తేజ్ ప్రస్తుతం కొరియన్ కనకరాజుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఆ తర్వాత నిహారిక నిర్మిస్తున్న బరి అనే చిత్రంలో నటించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల అనంతరం మారుతి-వరుణ్ తేజ్ కాంబోలో మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందేమో వేచి చూడాల్సిందే.


