
కోలీవుడ్ నటుడు ఆర్.మాధవన్, ఫాతిమా సనా షేక్ నటించిన చిత్రం ‘ఆప్ జైసా కోయి’ (Aap Jaisa Koi) ఓటీటీలో విడుదల కానుంది. కరణ్ జోహార్ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ (Netflix) వేదికగా జులై 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మాధవన్ మీడియా సమావేశంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. పెళ్లి అయిన హీరోయిన్లతో రొమాన్స్ సీన్స్ ఎలా ఉంటాయో ఆయన చెప్పుకొచ్చారు. ఆపై తమ వయసులో సగం ఉన్న హీరోయన్స్తో సినిమాలు చేయడం తనకు నచ్చదని చెప్పారు.
చాలా కాలంగా వయసుకు తగిన పాత్రలు చేయడమే తనకు ఇష్టమని మాధవన్ (55) చెబుతూనే ఉన్నారు. సీనియర్ హీరోలు, యంగ్ హీరోయిన్స్ల మధ్య ప్రేమ సినిమాలతో పాటు రొమాన్స్ సీన్స్ తెరకెక్కించడంలో ఇండస్ట్రీలో మార్పు వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. సీనియర్ హీరోలు యువకుల్లా నటిస్తూ.. హీరోయిన్స్ వెంటబడి తెరకెక్కించే సినిమాలు ఇప్పుడు రావడంలేదన్నారు. అలాంటి కథను ఏ హీరో ఓకే చేయడం లేదన్నారు. అలాంటి చిత్రాలను ప్రజలు కూడా తిరష్కరిస్తున్నారు. తాను కూడా 40 ఏళ్ల వయసులో కాలేజీ కుర్రాడిగా '3 ఇడియట్స్' లో నటించానని ఆ పాత్ర తనకు ఎంత మాత్రం సంతృప్తి ఇవ్వలేదన్నారు.

వివాహిత హీరోయన్లతో రొమాన్స్ కనిపించదు
మాధవన్ ఎప్పుడూ ట్రెండ్స్ ప్రకారం నడుచుకోనని చెబుతాడు. తమ వయసు మేరకు మాత్రమే పాత్రలను ఎంపిక చేసుకోవాలని అంటారు. వయసుకు తగిన పాత్రలతో పాటు హీరోయిన్ ఎంపిక కూడా ఒక సినిమాకు చాలా కీలకమని ఇలా చెప్పారు. 'వివాహం అయిన హీరోయిన్స్ రొమాంటిక్ సన్నివేశాల్లో సరిగ్గా నటించలేరు. వారితో ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ సరిగ్గా వర్కౌట్ కాదు. మీ ముందు ఉన్న వ్యక్తి పట్ల మీకు నిజంగా కాస్త అయినా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉండాలి. లేకపోతే ఆ సీన్ నిజం కాదని అనిపిస్తుంది. కానీ, వివాహిత హీరోయిన్లు దానిని తెరపై ఎప్పుడూ సృష్టించలేరు. పెళ్లి కావడం వల్ల వారు అప్పటికే అలాంటి అనుభూతి పొంది ఉంటారు. అలాంటప్పుడు ఆన్స్క్రీన్పై ఆ రకమైన కెమిస్ట్రీ కనిపించదు. ఈ కామెంట్తో నేను కొంత వివాదానికి కారణం కావచ్చు.' అని మాధవన్ అన్నారు.