‘పిఠాపురంలో అలా మొదలైంది’ మూవీ రివ్యూ | Pithapuram lo ALa Modalaindi Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

‘పిఠాపురంలో అలా మొదలైంది’ మూవీ రివ్యూ

Sep 18 2026 1:01 PM | Updated on Sep 18 2026 1:12 PM

Pithapuram lo ALa Modalaindi Movie Review And Rating In Telugu

టైటిల్‌: పిఠాపురంలో అలా మొదలైంది
నటీనటులు: డా. రాజేంద్రప్రసాద్, పృధ్విరాజ్ ,కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ, దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, తదితరులు
నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, FM మురళీ (గోదారి కిట్టయ్య)
దర్శకత్వం: మహేశ్‌ చంద్ర
విడుదల తేది: సెప్టెంబర్‌  18, 2026

కథేంటంటే..
పిఠాపురం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ప్రెసిడెంట్‌  వీర రాఘవ(రాజేంద్రప్రసాద్‌), స్కూల్‌ మాస్టర్‌ విశ్వనాథం(కేదార్‌ శంకర్‌), భూస్వామి బంగారయ్య(పృథ్వీ)..ముగ్గురు మంచి స్నేహితులు. వీరి కూతుళ్లు అంజని(ప్రత్యూష), కీర్తన(శ్రీలు), గీత(రిహానా)కూడా చిన్నప్పటి నుంచి కలిసే ఉంటారు. పదో తరగతి తర్వాత ఇంటర్‌ చదివేందుకు పిఠాపురం వెళ్తారు. ముగ్గురు ఒకే కాలేజీలో జాయిన్‌ అవుతారు. అక్కడ కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ముగ్గురు ముగ్గరు అబ్బాయిలతో ప్రేమలో పడతారు. 

టాపర్‌గా నిలిచే గీత.. డిగ్రీ చదువుతుండగానే పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. గీత..జల్సాలకు అలవాటు పడి..ప్రియుడు ఆకాశ్‌  మాటలు విని గోవాకు పారిపోతుంది. ఇలా ఇద్దరు స్నేహితులు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో తన ప్రేమ విషయం నాన్నకు చెప్పేందుకు అంజని భయపడుతుంది. చివరకు  తన ప్రేమ విషయాన్ని నాన్న వీర రాఘవకు చెప్పేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తల్లిదండ్రుల ప్రేమను కాదని ప్రియుడుతో వెళ్లాలనుకున్న గీత, కీర్తన..పెరెంట్స్‌ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలకున్న అంజన.. వీరిలో ఎవరి నిర్ణయం మంచిదైంది? తల్లిదండ్రుల పెంపకం.. పిల్లల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
ప్రేయసి రావే, చెప్పాలని ఉంది, ఆలస్యం అమృతం లాంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ టాలీవుడ్‌ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు చంద్ర మహేశ్‌. చాలా కాలం తర్వాత తన పేరును మహేశ్‌ చంద్రగా మార్చుకొని  ‘పిఠాపురంలో అలా మొదలైంది’అనే సినిమా తీశాడు. బ్లాక్‌ బస్టర్‌ హిట్లు ఇచ్చిన దర్శకుడు కావడం.. టైటిల్‌ కూడా ఆసక్తికరంగా ఉండడంతో ‘పిఠాపురంలో అలా మొదలైంది’సినిమాపై కొంత అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలతో సినిమాకు వెళ్తే మాత్రం కొంత నిరాశ తప్పదు. 

అలా అని తీసిపారేసే సినిమా అని చెప్పలేం. పాత తరహా కథాంశాన్నే ఎంచుకున్నప్పటికీ, నేటి యువతకు, తల్లిదండ్రులకు ఒక మంచి అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌,  ఇచ్చిన సందేశం బాగుంది. అయితే దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాల రొటీన్‌గా ఉన్నాయి. 

బ్రహ్మానందం వాయిస్‌ ఓవర్‌తో ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ కథ ప్రారంభం అవుతుంది. ముగ్గురు యువతులు..వారి పెరెంట్స్‌  చుట్టూ కథ తిరుగుతుంది. ఫస్టాప్‌ మొత్తం స్కూల్‌ డేస్‌.. కాలేజీ.. కొత్త పరిచయాలతో అమ్మాయిల్లో వచ్చే మార్పులు..లవ్‌ ట్రాక్‌..ఇలా సాగుతుంది. అయితే ఆయా సన్నివేశాలన్నీ రొటీన్‌గానే ఉంటాయి. ఇంటర్వెల్‌  సీన్‌ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండాఫ్‌  ఇంట్లో నుంచి పారిపోయిన గీత, కీర్తనలకు ఎదురైన సమస్యలు చూపించారు. ఆ సన్నివేశాలు ఎమోషనల్‌గా సాగుతాయి. అయితే ఈ తరహా కథలను ఆల్రెడీ చూసేయడంతో కొత్తగా అనిపించదు. క్లైమాక్స్‌తో అందరు కలవడం.. పెళ్లి తంతు, పెరెంట్స్‌ భావోద్వేగాలు అన్ని ఆకట్టుకుంటాయి. అలాగే రాజేంద్ర ప్రసాద్‌ చెప్పే మాటలు కూడా ఆలోచింపజేస్తాయి.

ఎవరెలా చేశారంటే.. 
ప్రెసిడెంట్‌ వీరరాఘవ పాత్రకి రాజేంద్ర ప్రసాద్‌ న్యాయం చేశాడు. ఆయన అనుభవం ఈ పాత్రకు చాలా ఉపయోగపడింది. ఇక స్ట్రిక్ట్‌  ఫాదర్‌గా కేదార్‌ శంకర్‌  బాగా నటించాడు. బాగా డబ్బున్న తండ్రిగా పృథ్వీ మెప్పించాడు. ముగ్గురు యువతులుగా చేసిన రిహానా, శ్రీలు, ప్రత్యూష తమ క్యారెక్టర్ల పరిధి మేరకు చక్కని అభినయం కనబరిచారు. గ్లామర్ పరంగానే కాకుండా ఎమోషనల్ సన్నివేశాల్లోనూ మెప్పించారు. సాంకేతిక విషయాలకొస్తే.. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను ఇంకాస్త క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement