కొత్త సినిమా చూసిన అనుభూతి కలిగింది: నాగార్జున | Nagarjuna About Shiva movie re release | Sakshi
Sakshi News home page

కొత్త సినిమా చూసిన అనుభూతి కలిగింది: నాగార్జున

Nov 11 2025 2:23 AM | Updated on Nov 11 2025 2:23 AM

Nagarjuna About Shiva movie re release

‘‘శివ’ సినిమా మాకు చాలా వ్యక్తిగతం. పదేళ్ల క్రితమే 4కే చేశాం. అయితే అప్పుడు డాల్బీ జరగలేదు. ఏదో లాభం వస్తుందని ఈ సినిమా విడుదల చేయడం లేదు. ‘శివ’ ఓ మ్యాజిక్‌. 4కె డాల్బీ అట్మాస్‌లో రీ రిలీజ్‌ వెర్షన్‌ చూస్తున్నప్పుడు కొత్త సినిమా చూసిన అనుభూతి కలిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌ 50ఏళ్ల సందర్భంగా ‘శివ’ రీ రిలీజ్‌ కావడం హ్యాపీగా ఉంది’’ అని అక్కినేని నాగార్జున తెలిపారు. ఆయన హీరోగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘శివ’. అన్నపూర్ణ స్టూడియోస్‌పై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్‌ 5న విడుదలైంది.

అన్నపూర్ణ స్టూడియోస్‌ 50 ఇయర్స్‌ సందర్భంగా ఈ నెల 14న ఈ సినిమాని రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ఈ మూవీ స్పెషల్‌ ప్రీమియర్‌ షో అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ–‘‘శివ’కి ఇంత ఆదరణ, కల్ట్‌ ఫాలోయింగ్‌ ఉంటుందని, 36 ఏళ్ల తర్వాత రీ రిలీజ్‌ కోసం కలుస్తామని నేను కలలో కూడా అనుకోలేదు. ఈ సినిమా కోసం రాము(రామ్‌గోపాల్‌ వర్మ) అప్పుడు ఎంత ఇష్టపడి చేశాడో రీ రిలీజ్‌ కోసం కూడా ఆరు నెలల నుంచి అంతే ఇష్టంతో వర్క్‌ చేశారు. మణిరత్నంగారితో నేను ‘గీతాంజలి’ సినిమా చేసిన తర్వాత ‘శివ’ కథతో రాము నా వద్దకు వచ్చారు.

ఇద్దరు దర్శకులు కూడా మాస్టర్స్‌. వారి సెన్సిబిలిటీస్‌ నాకు ఇష్టం. రెండు సినిమాలు చాలా అద్భుతంగా ఆడాయి. ‘శివ’ సినిమాకి సీక్వెల్‌ చేసే అంత కరేజ్, గట్స్‌ నాగచైతన్య, అఖిల్‌కి ఉన్నాయని అనుకోవడం లేదు (నవ్వుతూ)’’ అని తెలిపారు. రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ–   ‘‘శివ’ రీ రిలీజ్‌లో సౌండ్‌ క్యాలిటీ బాగుందని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. నేను మళ్లీ ‘శివ’ సినిమా తీస్తే అది కేవలం నాగార్జునతోనే. అయితే ముందుగా నేను బయట ఒక హిట్‌ సినిమా తీసిన తర్వాతే నాగార్జునని అ్ర΄ోచ్‌ అవుతాను’’ అని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement