
ఈ ఏడాది సెప్టెంబరు 4 నుంచి సెప్టెంబరు 14 వరకు 50వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టీఐఎఫ్ ఎఫ్) జరగనుంది. ఈ వేడుకలో ఇండియన్ కల్ట్ బ్లాక్బస్టర్ సినిమా ‘షోలే’, ‘బందర్’, ‘హోమ్ బౌండ్’ సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ధర్మేంద్ర, సంజీవ్కుమార్, అమితాబ్ బచ్చన్ , హేమ మాలిని, జయబాదురి, అమ్జాద్ ఖాన్ ప్రధాన పాత్రల్లో రమేష్ సిప్పి దర్శకత్వం వహించిన ‘షోలే’ 1975 ఆగస్టు 15న విడుదలైంది. కాగా 50వ టీఐఎఫ్ఎఫ్ ప్రారంభమయ్యే సమయానికి ‘షోలే’ విడుదలై 50 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఈ సినిమా లేటెస్ట్ 4కే వెర్షన్ ఇక్కడ ప్రదర్శితం కానుంది.
అలాగే బాబీ డియోల్ హీరోగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బందర్’. ‘మంకీ ఇన్ ఏ కేజ్’ అనేది క్యాప్షన్ . ఈ చిత్రంలో సాన్య మల్హోత్రా ఓ లీడ్ రోల్లో నటించారు. కొన్ని వాస్తవ ఘటనలతో రూపొందిన తమ సినిమా ఈ ఫెస్టివల్లో ప్రదర్శితం కానుందని అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు. ఇంకా ఈ ఏడాది ఫ్రాన్్సలో జరిగిన 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడిన ‘హోమ్బౌండ్’ టీఐఎఫ్ఎఫ్లో స్క్రీనింగ్ కానుంది.
ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని హైదరాబాదీ దర్శకుడు నీరజ్ ఘైవాన్ తెరకెక్కించగా, కరణ్ జోహార్ నిర్మించారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభానికి ఇంకా సమయం ఉంది కనుక.. ఈ ఫెస్టివల్లో స్క్రీనింగ్ లేదా ప్రీమియర్ కానున్న భారతీయ సినిమాల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి.