
దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా కె. పవన్కుమార్ దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి నిర్మించిన చిత్రం ‘మెరిసే మెరిసే’. ఈ నెల 6న విడుదలైన తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రయూనిట్ చెబుతోంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక శ్వేత మాట్లాడుతూ– ‘‘మా స్వస్థలం పుణే. మోడలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కమర్షియల్ యాడ్స్ కోసం హైదరాబాద్కు వచ్చేదాన్ని. ‘మళ్లీ మళ్లీ చూశా’ హీరోయిన్గా నా తొలి చిత్రం. ‘మెరిసే మెరిసే’ రెండో చిత్రం.
ఈ సినిమాతో పాటు ఇందులో నేను పోషించిన వెన్నెల పాత్రకు మంచి స్పందన వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఉత్తరాది ప్రేక్షకుల కంటే దక్షిణాది ప్రేక్షకులు సినిమాను ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక్కడ స్టార్స్ను ఆరాధిస్తారు. ఇక్కడ సినిమా అంటే ఓ ఎమోషన్... ఓ సెలబ్రేషన్. ‘మహానటి’లో కీర్తీ సురేష్గారు అద్భుతంగా చేశారు. అలాంటి వైవిధ్యమైన పాత్రలు చేయాలనుంది. ప్రస్తుతం ఓ ప్యాన్ ఇండియన్ మూవీలో నటిస్తున్నాను’’ అన్నారు.