బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు స్వైన్ ఫ్లూ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇమ్రాన్.. ఇటీవల ముంబైకి తిరిగి వచ్చిన అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరీక్షల్లో ఇన్ఫ్లూయెంజా ఏ, స్వైన్ ఫ్లూ తేలినట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇమ్రాన్ హష్మీ అనారోగ్యానికి గురయ్యారనే విషయం తెలియడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే తన ఆరోగ్య పరిస్థితిపై ఇమ్రాన్ ఇప్పటివరకు ప్రత్యేకంగా స్పందించలేదు. మరోవైపు బెంగళూరులో శనివారం జరగాల్సిన తన లైవ్ ఈవెంట్కు హాజరు కాలేకపోతున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అనారోగ్యం కారణంగానే కార్యక్రమానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని అభిమానులకు తెలిపారు.
అయితే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయకుండా సెప్టెంబర్ 12కు వాయిదా వేసినట్లు ఇమ్రాన్ ప్రకటించారు. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసినవారు వాటిని భద్రంగా ఉంచుకోవచ్చని.. కొత్త తేదీన అవే టికెట్లు చెల్లుబాటు అవుతాయని నిర్వాహకులు వెల్లడించినట్లు సమాచారం. కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నందుకు అభిమానులకు ఇమ్రాన్ క్షమాపణలు చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ హష్మీ ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్లో జోష్ మీదున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘ఆవారాపన్ 2’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితిన్ కక్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2007లో విడుదలైన ‘ఆవారాపన్’కు సీక్వెల్గా రూపొందింది. దిశా పటానీ, షబానా అజ్మీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.విడుదలైన తొలిరోజు నుంచే ‘ఆవారాపన్ 2’కు మంచి స్పందన వచ్చింది. రెండో రోజునే ఈ చిత్రం రూ.33.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇప్పటి వరకు మొత్తంగా ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ని రాబట్టింది.


