
తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా గద్దర్ అవార్డుల వేడుక జరిపింది. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా ఈ వేడుక శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకని దగ్గరుండి విజయవంతం చేసిన దిల్ రాజు.. తాజాగా మీడియాతో మాట్లాడారు. అవార్డ్స్ వేడుక సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.
(ఇదీ చదవండి: 'కాంతార'ని వెంటాడుతున్న శాపం? ఈసారి ఏకంగా హీరో)
గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవంపై ప్రెస్ మీట్ పెట్టిన దిల్ రాజు.. 'గద్దర్ అవార్డ్స్ వేడుకలు నిన్న భారీ ఎత్తున నిర్వహించాం. ఆ ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ అవార్డ్స్ వేడుక కోసం గత 6 నెలలు నుంచి వర్క్ చేశాం. ఇది పెద్ద సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అవార్డ్ గ్రహీతలందరికీ థాంక్స్. ముఖ్యమంత్రి గారికి బిగ్ బిగ్ థ్యాంక్స్. ఇంత పెద్ద ఈవెంట్లో సీఎం.. రెండు గంటలు పైన ఉన్నారు. త్వరలో ఏపీలో కూడా అవార్డ్స్ మొదలవుతాయి. ప్రభుత్వం నుంచి అవార్డు వస్తుందంటే స్వీకరించే వాళ్లు ఎన్ని పనులున్నా కచ్చితంగా వచ్చి స్వీకరించాలి ఇది నా రిక్వెస్ట్' అని చెప్పుకొచ్చారు.
అలానే ప్రభుత్వ అవార్డుల స్వీకరణలో సినీ పరిశ్రమ తీరుపై ఏఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల కోసం ఆరు నెలలుగా కష్టపడితే సక్సెస్ అయింది. ప్రభుత్వం అవార్డులు ఇస్తుందంటే అందరూ హాజరై తీసుకోవాలి. అవార్డుల తేదీ ప్రకటించాక ఆ తేదీన అందరూ అవార్డు కోసం కేటాయించాలి. ఇంత పెద్ద ఈవెంట్లో ఏవైనా పొరపాట్లు జరిగితే క్షమించాలని దిల్ రాజు కోరారు.
ఈ వేడుకలో 'పుష్ప 2' చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డ్ స్వీకరించగా, ఉత్తమ నటిగా '35: ఇది చిన్న కథ కాదు' సినిమాకుగాను నివేదా థామస్ పురస్కారం అందుకుంది. గతేడాది అన్ని విభాగాలకు అవార్డులు బహుకరించగా.. 2014 నుంచి 2023 వరకు మాత్రం మూడేసి ఉత్తమ చిత్రాల్ని ఎంపిక చేసి అవార్డ్స్ ఇచ్చారు. గ్రహీతలకు సిల్వర్ మొమెంటో, ప్రశాంసా పత్రం, రూ.5 లక్షల మొత్తాన్ని అందజేశారు.
(ఇదీ చదవండి: హీరోయిన్ నివేదా థామస్ ఇంతలా మారిపోయిందేంటి?)