
దేశ సరిహద్దులలో జవానులు, దేశం లోపల పోలీసులు ప్రజలను రక్షించేందుకు ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు శ్రమిస్తుంటారని ప్రముఖ నటుడు, దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు.
వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, హీరో హీరోయిన్లుగా జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వంలో బలగం జగదీష్ నిర్మిస్తున్నచిత్రం "కానిస్టేబుల్"" చిత్రం విడుదలకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ఓ ఎమోషనల్ పాటను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్.నారాయణమూర్తి ఆవిష్కరించారు. ఈ పాటను రామారావు రచించగా, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ ఆలపించడం ఓ విశేషం.
ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి స్పందిస్తూ, "సమాజంలో పోలీసులు పోషిస్త్తున్న పాత్ర అనిర్వచనీయం. చట్టాన్ని కాపాడుతూ నిజాయితీగా పనిచేసే పోలీసులు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంటారు. అలాంటి నిజాయితీ కలిగిన ఓ కానిస్టేబుల్ ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందించడం అభినందనీయం. ఈ రోజు నేను ఆవిష్కరించిన ఎమోషనల్ పాట మనసును ఎంతగానో హత్తుకుంటోంది. ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ ఈ పాటను ఆలపించి రక్తికట్టించారు. నా కళ్ళు చమర్చాయి. వరుణ్ సందేశ్ కు ఇది కమ్ బ్యాక్ చిత్రం కావాలి. కెప్టెన్ అఫ్ ది షిప్ దర్శకుడు. ట్రైలర్, ఈ పాట చూస్తుంటే దర్శక, నిర్మాతల అభిరుచి అర్ధమవుతోంది" అని అన్నారు.
హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, "నేను ఇంతవరకు నటించిన చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో నా పాత్ర ఉంటుంది. చక్కటి డ్రామా, ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్, సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ప్రేక్షకులను అలరింపజేస్తుంది. యూనిట్ సమష్టి కృషికి ఈ చిత్రం ఓ మంచి ఉదాహరణగా నిలిచిపోతుంది. అలాగే నా కెరీర్ కు మరో మలుపు అవుతుంది" అని అన్నారు