నటుడి కొడుకు కోసం చిరంజీవి ఖరీదైన గోల్డ్‌ చైన్‌‌!

Chiranjeevi Gift Gold Chain To Narsing Yadav Son - Sakshi

గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న నర్సింగ్‌ యాదవ్‌ సతీమణి

ఎన్నో సినిమాల్లో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటుడు నర్సింగ్‌ యాదవ్‌... తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఆయన.. కామెడీ, విలన్‌ పాత్రల్లో నటించి మెప్పించారు. జనానికి వినోదాన్ని పంచిన అతడు గత ఏడాది డిసెంబర్‌ 31న అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఆయన మరణం అభిమానులు, సెలబ్రిటీలను కలచివేసింది. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవి తన ఆప్తుడు ఇక లేడు, తిరిగి రాడన్న వార్త విని తీవ్ర ఆవేదన చెందాడు. చిరంజీవికి, నర్సింగ్‌ యాదవ్‌కు మధ్య ఉన్న అనుబంధాన్ని గూర్చి నర్సింగ్‌ సతీమణి చిత్ర తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 

"చిరంజీవి ఏ సినిమా షూటింగ్‌ జరుగుతున్నా అక్కడ నర్సింగ్‌ ఉండాల్సిందే. ఆయన లొకేషన్‌కు వచ్చేముందే నర్సింగ్‌ అక్కడ పరిస్థితులు చక్కబెట్టేవాడు. అలా వారిద్దరి మధ్య బంధం పెరుగుతూ వచ్చింది. మేము చాలాసార్లు చిరంజీవి ఇంటికి వెళ్లాం కూడా.. పది సంవత్సరాల వరకు ఆయనకు రాఖీ కూడా కట్టాను. మా బాబు పుట్టిన మూడు నెలలకు అతడిని తీసుకుని చిరంజీవిగారి దగ్గరకు వెళ్లాను. మమ్మల్ని చూడగానే మెగాస్టార్‌ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మేనేజర్‌ను పంపించి అప్పటికప్పుడు బంగారు చైన్‌ కొని తీసుకురమ్మన్నారు. నర్సింగ్‌కు బాబు పుట్టాడన్న సంతోషంతో ఆ ఖరీదైన గోల్డ్‌ చెయిన్‌ను పిల్లోడి మెడలో వేశారు. అది ఏడు తులాల కంటే ఎక్కువే ఉంటుంది. సురేఖ గారు కూడా పసుపు బొట్టు ఇచ్చారు. ఎంతో క్లోజ్‌గా మాట్లాడేవాళ్లు. అది చూసి కొన్నిసార్లు నేనే ఆశ్చర్యపోయేదాన్ని" అని చెప్పుకొచ్చింది.

చదవండి: ప్లీజ్,‌ పరిస్థితి అర్థం చేసుకోండి : ప్రియాంక చోప్రా విజ్ఞప్తి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top