నిర్మాలా కాన్వెంట్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా..పెళ్లి సందడి మూవీతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నా.. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని పీరియాడికల్ ఫిల్మ్ ‘ఛాంపియన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘ఛాంపియన్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రోషన్ ఖాతాలో హిట్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
ఈ సినిమా కథంతా 1747-48 ప్రాంతంలో జరుగుతుంది. సికింద్రాబాద్లోని ఒక బేకరీలో పని చేసే మైఖేల్(రోషన్)కి ఫుట్బాల్ ఆట అంటే చాలా ఇష్టం. ఈ ఆటతోనే ఎప్పటికైనా ఇంగ్లాండ్ వెళ్లి..అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఓసారి ఇంగ్లాండ్ వెళ్లే అవకాశం వస్తుంది. కానీ అతని తండ్రి చేసిన ఓ పని వల్ల వెళ్లలేకపోతాడు. దొంగమార్గాన ఇంగ్లాండ్ వెళ్లాలనుకుంటాడు. దాని కోసం కొన్ని తుపాకులను ఒక చోటుకి తరలించాల్సి వస్తుంది. ఆ పని చేసే క్రమంలో పోలీసుల కంటపడతారు. వారి నుంచి తప్పించుకొని అనుకోకుండా బైరాన్పల్లి అనే గ్రామానికి వస్తాడు. అదే ఊరికి చెందిన చంద్రకళ(అనస్వర రాజన్)తో పరిచయం.. నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆ ఊరి ప్రజలు చేసిన తిరుగుబాటు రోషన్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? పోలీసు అధికారి బాబు దేశ్ముఖ్ (సంతోష్ ప్రతాప్)తో మైఖేల్ గొడవ ఏంటి? బైరాన్పల్లి ప్రజల కోసం మైఖేల్ చేసిన త్యాగమేంటి? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
ప్రపంచంలోని పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి చాలా ప్రత్యేకత ఉంది. అందులో బైరాన్పల్లి గ్రామస్తులు చేసిన పోరాటం మరింత ప్రత్యేకం. ప్రాణాలు పోతాయని తెలిసినా.. నిజాం పాలకులపై ఎదురుదాడి దిగారు. ఒకనొక దశలో రజాకార్లకే ముచ్చమటలు పట్టించారు. ఆ ఊరి ప్రజలు సాగించిన వీరోచిత పోరాటాన్నే ‘చాంపియన్’లో మరోసారి చూపించారు దర్శకుడు ప్రదీప్ అద్వైతం. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చినప్పటికీ.. ఓ ఆటగాడి కోణంలో సాయుధ పోరాటాన్ని చూపించడం.. అందులోనూ ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను చెప్పడం ‘ఛాంపియన్’ స్పెషల్. అది తప్పితే ఈ సినిమా కథంతా రొటీన్గానే సాగుతుంది. పైగా చాలా చోట్ల సాగదీతగా అనిపిస్తుంది.
ఆపరేషన్ పోలోకి దారి తీసిన సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత రజాకార్ల అరచకాలు.. బైరాన్పల్లి ప్రజల పోరాటాన్ని చూపించి.. కథను సికింద్రాబాద్కి మార్చాడు. అక్కడ ఆంగ్లో ఇండియన్ కుర్రాడిగా హీరో పరిచయం.. ఫుట్బాల్ టోర్నమెంట్, కోవై సరళ, వెన్నెల కిశోర్ సన్నివేశాలన్నీ కాస్త ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. కథ అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరో ఎప్పుడైతే బైరాన్ పల్లి గ్రామానికి వస్తాడో.. అప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. హీరోయిన్తో పరిచయం.. నాటక ప్రదర్శన.. 'గిర్రా గిర్రా.. పాట ఇవన్నీ ఎంటర్టైనింగ్గా సాగుతాయి.
బైరాన్పల్లిపై రజాకార్ల దాడి జరగడం.. హీరో ఊరి పోరాటంలో భాగమవ్వడం.. అవ్వడంతో సెకండాఫ్పై మరింత ఆసక్తి పెరుగుతుంది. అయితే ద్వితియార్థంలోనూ డ్రామాపైనే దర్శకుడు ఎక్కువ ఫోకస్ చేశాడు. కథనాన్ని పరుగులు పెట్టించే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ దిశగా ఆలోచన చేయలేదు. ఎమోషనల్ సన్నివేశాలనే హైలెట్ చేశాడు. కానీ అవి పూర్తిగా వర్కౌట్ కాలేదు. ప్రేమ కథ ఒకవైపు.. సాయుధ పోరాటం మరోవైపు.. ఈ రెండిటిలో దేనికి ప్రేక్షకుడు పూర్తిగా కనెక్ట్ కాలేదు. రజాకార్లలో అసలు పోరాటం మొదలైనప్పటి నుంచి క్లైమాక్స్ వరకు కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా హీరో తండ్రి నేపథ్యం.. ఆయన చెప్పే మాటలు ఆలోచింపజేస్తాయి. హీరో తండ్రి పాత్రలో ఓ స్టార్ హీరో కనిపించడం ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుంది. భావేద్వేగానికి గురి చేసేలా క్లైమాక్స్ ఉంటుంది.
ఎవరెలా చేశారంటే..
మైఖేల్ సి విలియమ్స్ పాత్రలో రోషన్ ఒదిగిపోయాడు. తెలంగాణ యాసలో డైలాగ్స్ని అదరగొట్టేశాడు. డ్యాన్స్ కూడా ఇరగదీవాడు. యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపించింది. తాళ్లపూడి చంద్రకళగా అనస్వర తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించింది. రాజిరెడ్డి పాత్రకు నందమూరి కల్యాణ్ చక్రవర్తి అంతగా సెట్ అవ్వలేదు. తెలంగాణ యాసను పలకడంలో ఆయన తడబడ్డాడు. పాత్ర సుందరయ్యగా మురళీశర్మ ఆకట్టుకుంటారు. రచ్చరవి, మురళీధర్ గౌడ్, బలగం సంజయ్, అర్చనతో పాటు మిగిలిన నటీనటులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే మేయర్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తోటతరణి ఆర్ట్ వర్క్ బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేసి నిడివి తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.


