
మంచు మనోజ్ డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ 'కన్నప్ప'. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ కూడా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్కు రెడీగా ఉంది. ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో కన్నప్ప ప్రమోషన్స్తో బిజీగా మేకర్స్. ఇందులో భాగంగానే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు.
ఈ ఈవెంట్కు హాజరైన హాస్యనటుడు బ్రహ్మనందం ఆసక్తికర కామెంట్స్ చేశారు. మోహన్ బాబును ఉద్దేశించిన ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అసలు ఈ సినిమా ఆయన ఎందుకు తీశారా?అని ఒకసారి అనుకున్నానని తెలిపారు. డబ్బుల గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించే ఆయన ఇంత భారీ బడ్జెట్తో ఎలా ప్లాన్ చేశారా? అనిపించిందని అన్నారు.
బ్రహ్మనందం మాట్లాడుతూ..' కన్నప్ప సినిమా మోహన్ బాబు ఎందుకు తీశారా అని ఒకసారి అనుకున్నా. ఎందుకంటే మోహన్ బాబు గురించి మీ అందరికీ తెలుసు. ఆయన ఐదు కోట్లో, పది కోట్లతోనూ సినిమా తీసి దాంతో ఓ పది, పదిహేను కోట్లు సంపాదించుకుని.. వాటితో మళ్లీ ఇంకో సినిమా తీసే వ్యక్తి. అలాంటి డబ్బుకు ప్రాధాన్యత ఇస్తూ గౌరవించే వ్యక్తిగా నాకు తెలుసు. 200 కోట్ల రూపాయలు పెట్టి కన్నప్ప సినిమా ఎందుకు ప్లాన్ చేశాడని ఆలోచిస్తే.. ఈ ఆలోచన ఆయనది కాదు.. సకల సృష్టి కార్యుడైన ఆ పరమేశ్వరుని ఆలోచన అతనిలో సంక్రమించిదేమో అనిపించింది' అని అన్నారు.
ఈ వేదికపై బ్రహ్మనందం.. ప్రభాస్ పేరు ప్రస్తావించగానే అభిమానులు పెద్దఎత్తున సందడి చేశారు. ప్రపంచమంతా గర్వించే నటుల్లో ప్రభాస్ ఒకరని అన్నారు. డబ్బు కోసమో.. ఏదో ఒక పాత్ర కోసమో ఆయన ఈ సినిమాని అంగీకరించలేదని తెలిపారు. ప్రభాస్ మానవతా విలువలు కలిగిన వ్యక్తి.. ఒక మంచి మనిషి.. ఎవరు చేయి చాచి ఏ సాయం అడిగినా కాదనడు ప్రభాస్.. మోహన్బాబుకు ఆయన సన్నిహితుడని పేర్కొన్నారు. ప్రభాస్ నటన చూడగానే ఇది కదా సినిమా.. ఇది కదా శివభక్తి అని అనిపించిందని బ్రహ్మానందం వెల్లడించారు.