తెలుగు సినిమా స్థాయి పెరిగింది: బాలకృష్ణ | Balakrishna Daaku Maharaaj Success Meet | Sakshi
Sakshi News home page

తెలుగు సినిమా స్థాయి పెరిగింది: బాలకృష్ణ

Jan 19 2025 12:47 AM | Updated on Jan 19 2025 12:47 AM

Balakrishna Daaku Maharaaj Success Meet

బాబీ, ప్రగ్యా జైస్వాల్, బాలకృష్ణ, శ్రద్ధా శ్రీనాథ్, తమన్, వేద అగర్వాల్, సూర్యదేవర నాగవంశీ

‘‘ఇతర దేశస్తులు కూడా మన సినిమాలను చూసి, ప్రశంసించే స్థాయికి తెలుగు చలన చిత్రసీమ ఎదిగింది. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని ఆదరిస్తారు. ‘డాకు మహారాజ్‌’ విజయంతో ఇది మరోసారి రుజువైంది’’ అని బాలకృష్ణ అన్నారు. ఆయన టైటిల్‌ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్‌’.

ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్‌ అయింది. రిలీజైన ఐదు రోజుల్లోనే రూ. 114 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌తో ‘డాకు మహారాజ్‌’ సూపర్‌ హిట్‌గా ప్రదర్శితమవుతోందని చిత్రబృందం పేర్కొంది. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ప్రతి సినిమాని ఓ చాలెంజ్‌గా తీసుకుని చేస్తాను.

వరుసగా ఇది నాకు నాలుగో (‘అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌ కేసరి, డాకు మహారాజ్‌’) విజయం. ప్రతి నటుడి నుంచి అందమైన హావభావాలను రాబట్టుకోగలిగాడు బాబీ. తమన్‌ ఇంటి పేరును అభిమానులు మార్చేశారు. నేనైతే ఎన్‌బీకే తమన్‌ అని నామకరణం చేస్తున్నాను. అన్ని క్రాఫ్ట్స్‌పై అవగాహన ఉన్న నాగవంశీ నా అభిమాని కావడం నాకు గర్వంగా ఉంది’’ అని మాట్లాడారు. ‘‘బాలకృష్ణగారి ఫిల్మోగ్రఫీలో గుర్తుండిపోయే సినిమాలా ‘డాకు మహారాజ్‌’ ఉండాలని మొదలుపెట్టాం.

డిస్ట్రిబ్యూటర్స్‌ అందరికీ మూడు రోజుల్లోనే డబ్బులు రావడం చాలా ఆనందంగా ఉంది. ఓ దర్శకుడికి ఇంతకన్నా ఆనందం మరొకటి ఉండదు’’ అన్నారు దర్శకుడు బాబీ. ‘‘జనవరి 12న ‘డాకు మహారాజ్‌’ విడుదలైతే, సంక్రాంతి పండగ రోజుకే మా డిస్ట్రిబ్యూటర్లు సేఫ్‌ జోన్‌కి వెళ్లిపోయారు. డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వచ్చినప్పుడే నిర్మాతలకు నిజమైన ఆనందం’’ అని పేర్కొన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ.

Advertisement
 
Advertisement
Advertisement