ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్.. చిరంజీవి, రానా మూవీలకు బిగ్‌ షాక్‌!

Anti Terrorism Forum Shock To Chiranjeevi Acharya And Rana Virata Parvam - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’, రానా దగ్గుబాటి ‘విరాటపర్వం’సినిమాలకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ రెండు సిసినిమాలకు సెన్సార్‌ క్లియరెన్స్‌ ఇవ్వొద్దని హైదరాబాద్‌ ఆధారిత సంస్థ యాంటీ టెర్రరిజం ఫోరమ్ సెన్సార్‌ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఈ రెండు సినిమాలు నక్సలైట్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నవే. ఇటీవల చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది జవాన్లు మృతి చెందాడు.  ఈ ఘటన తర్వాత మావోయిస్టులపై దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది.ఈ నేపథ్యలో నక్సలైట్‌ బ్యాక్‌డ్రాప్‌ వస్తున్న ‘ఆచార్య’, ‘విరాటపర్వం’ చిత్రాలకు అనుమతి ఇవ్వొదన్ని యాంటీ టెర్రరిజం ఫోరమ్‌ తాజాగా సెన్సార్‌ బోర్డుకు విన్నవించింది.

అంతేకాదు భవిష్యత్తులో కూడా ఇలాంటి సినిమాలు రాకుండా చూడాలని కోరింది. తమ విజ్ఞప్తిని కాదని సినిమాలను విడుదల చేస్తే... కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించింది. ఈ క్రమంలో ఆచార్య, విరాటపర్వం చిత్రాలపై సెన్సార్‌ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. 

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న చిత్రమే ‘ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో చిరు, రామ్‌ చరణ్‌ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. మే  13న ఈ సినిమా విడుదలకానుంది.

 ఇక రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో ఉడుగుల వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘విరాటపర్వం’. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రియమణి, నివేదా పెతురాజ్, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్‌ రవన్నగా నటిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top