
బిగ్బాస్ గౌతమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సోలో బాయ్ (Solo Boy Movie). బుధవారం ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మురళీనాయక్ తల్లిదండ్రులు హాజరయ్యారు. వారి కుటుంబానికి యాంకర్, బిగ్బాస్ ఫేమ్ స్రవంతి ఆర్థిక సాయిం ప్రకటించారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన శ్రీరాంనాయక్, జ్యోతిబాయి దంపతులు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 'ఆపరేషన్ సిందూర్'లో మురళీనాయక్ మరణించిన విషయం తెలిసిందే.
లక్ష రూపాయలు సాయం
బిగ్ బాస్ ఫేమ్, యాంకర్ స్రవంతి చొక్కారపు సోషల్ మీడియా నుంచి స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో యాంకరింగ్ చేసే స్థాయికి ఆమె చేరుకుంది. అయితే, ఆమె పలు సందర్భాల్లో తోచిన సాయం చేసి దాతృత్వం చాటుకుంది. తాజాగా 'సోలో బాయ్' సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి ఆమె యాంకర్గా పనిచేశారు. ఆ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులకు ఆమె లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన బిడ్డను తిరిగి తీసుకురాలేమని, తమవంతుగా ఆర్థిక సాయం మాత్రం చేయగలమని ఆమె తెలిపింది. దేశాన్ని కాపాడే బిడ్డను కన్నందుకు వారికి కృతజ్ఞతలు చెప్పింది.
ఆ కుటుంబం కోసం ఉచితంగానే యాంకరింగ్ చేస్తా
సోలో బాయ్ వేడుక పూర్తికాగానే డబ్బులు ట్రాన్సఫర్ చేస్తానని ఆమె చెప్పింది. ఇంతలో సంగీత దర్శకుడు కూడా సాయం ప్రకటించారు. త్వరలో మురళీనాయక్ గ్రామం 'కళ్లితండా'లో సంగీత కచేరి ఏర్పాటు చేసి వచ్చిన డబ్బు ఆ కుటుంబానికి అందిస్తామని ప్రకటించారు. అదే కార్యక్రమానికి రెమ్యునరేషన్ లేకుండా యాంకరింగ్ చేస్తానని స్రవంతి తెలిపింది. స్రవంతి ఇలా సాయం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆమె సంపాదించిన డబ్బులో కొంత పలు సందర్భాల్లో సాయం చేసింది. గతేడాదిలో భారీ వర్షాలు విజయవాడను ముంచెత్తిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. కనీసం తాగేందుకు మంచినీరు లేక ఇబ్బందులు పడ్డారు. అప్పుడు స్రవంతి కూడా తనవంతుగా లక్ష రూపాయలు ముఖ్యమంత్రి నిధికి పంపింది. దీంతో స్రవంతిని నెటిజన్లు అభినందిస్తున్నారు. స్రవంతిలో అందమే కాదు.. మంచి గుణం కూడా ఉందంటూ ప్రశంసిస్తున్నారు.