ఆభరణాలు అనగానే ఆడవాళ్లే గుర్తొస్తారు.. ఏ మగవాళ్లు ఎందుకు వేసుకోకూడదు? అంటున్నాడు కొత్త పెళ్లి కొడుకు అల్లు శిరీష్. ఇటీవలే శిరీష్ మనసుపడ్డ అమ్మాయిని మనువాడాడు. నిశ్చితార్థం దగ్గరి నుంచి పెళ్లి వరకు తనకు నచ్చినట్లుగా రెడీ అయ్యాడు. నెక్లెస్ ధరించాడు. హీరో విజయ్ దేవరకొండ కూడా తన పెళ్లిలో వెరైటీ ఆభరణాలు ధరించి హైలైట్ అయ్యాడు.
ఎంగేజ్మెంట్ సమయంలో ట్రోలింగ్
అయితే ఇలా బంగారు, వజ్రాభరణాలు ధరించడం వల్ల శిరీష్పై కొంత ట్రోలింగ్ జరగ్గా అప్పట్లోనే కౌంటర్ ఇచ్చాడు. తాజాగా మరోసారి తనపై జరిగిన ట్రోలింగ్పై స్పందించాడు. ఇప్పుడు ఆడ, మగ అని తేడాలు చూస్తున్నారు.. కానీ, అప్పట్లో మగవాళ్లు కూడా నగలు వేసుకున్నారు. వందేళ్ల క్రితం పురుషులకు, మహిళలకు కలిపే పర్ఫ్యూమ్స్ తయారు చేశారు.
చుట్టూ ఉన్నవాళ్లు కూడా..
ఇప్పుడేమో అబ్బాయిలకు బ్లూ అని, అమ్మాయిలకు పింక్ ఫేవరెట్ అంటూ బేధాలు సృష్టించారు. అందుకే నన్ను ఎంత తిట్టుకున్నా సరే ఈ అడ్డుగోడల్ని కూల్చాలనే అనుకున్నాను. అయితే నా అభిప్రాయాల్ని నా చుట్టూ ఉన్న కొందరు అనుమానించారు. ఇప్పుడీ హారాలు వేసుకోవడం అవసరమా? అని ప్రశ్నించారు. ఎహె, ఊరుకోండి, మనం కూడా ట్రై చేయకపోతే ఇంకెవరు చేస్తారు? లేదంటే ఇంకో ఇరవై ఏళ్లు కూడా ఇలాగే ఉంటుంది అని బదులిచ్చాను.
నేనే డిసైడ్ చేసుకుంటా..
నా జీవితంలోని ప్రత్యేక సందర్భమైన పెళ్లి వేడుకలో నాకు నచ్చినట్లుగా రెడీ అయ్యాను. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మగవాళ్లు ఎలా ఉండాలి? ఆడవాళ్లు ఎలా ఉండాలి? అని ఇతరులు నిర్ణయించాల్సిన పని లేదు. నేనేం ధరించాలనేది నాకు తెలుసు, ఇతరులు చెప్పనక్కర్లేదు అని శిరీష్ ముగించాడు.


