ఆ నమ్మకం ఉంది

Allari Naresh Speech At Itlu Maredumilli Prajaneekam Press Meet - Sakshi

–  ‘అల్లరి’ నరేశ్‌  

‘‘మన చుట్టుపక్కల జరిగే కథే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఓ నిజాయితీ సినిమా. కొత్తదనాన్ని కోరుకుంటున్న ప్రేక్షకులు కొత్త ప్రయత్నంగా మేం చేసిన ‘మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని ‘అల్లరి’ నరేశ్‌ అన్నారు. ‘అల్లరి’ నరేశ్‌ హీరోగా ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వంలో జీ స్టూడియోస్‌తో కలిసి రాజేష్‌ దండా నిర్మించిన చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌. ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది.

ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో ‘అల్లరి’ నరేశ్‌ మాట్లాడుతూ – ‘‘నాంది’ సినిమాతో నిర్మాత సతీష్‌గారికి ఎంత మంచి పేరు వచ్చిందో ‘ఇట్లు మారేడు...’తో రాజేష్‌గారికి అంత మంచి పేరు వస్తుంది. సినిమా చూసిన తర్వాత మాటల రచయిత అబ్బూరి రవి, సంగీత దర్శకుడు శ్రీ చరణ్‌ గురించి గొప్పగా చెప్పుకుంటారు. చివరి 20 నిమిషాలు సినిమా ఇంకా అద్భుతంగా ఉంటుంది’’ అని అన్నారు. ‘‘వినోదం, హాస్యం, యాక్షన్‌ ఇలా అన్ని అంశాలు ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు ఏఆర్‌ మోహన్‌.

‘‘స్వామి రారా’తో డిస్ట్రిబ్యూటర్‌గా ఇండస్ట్రీకి వచ్చాను. దాదాపు 75 సినిమాలు డిస్ట్రిబ్యూట్‌ చేశాను. నిర్మాతగా ఇది నా తొలి చిత్రం అయినప్పటికీ ఒత్తిడి అనిపించలేదు’’ అన్నారు రాజేష్‌. ‘‘ఈ సినిమాలో నేను రాసినవి మాటలు కాదు.. ఆ పాత్రల తాలూకు  భావాలు. అలాగే ఈ సినిమాకు ఓ లిరిసిస్ట్‌లా ఓ పాట రాసి, సింగర్‌గా పాడటం సంతోషంగా ఉంది’’ అన్నారు రచయిత అబ్బూరి రవి.

ఓ బాధ్యతగల పౌరుడిగా ఎన్నికలప్పుడు నా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాను. సకాలంలో పన్నులు చెల్లిస్తున్నాను. ఇక రాజకీయలపై నాకు అంతగా ఆసక్తిలేదు. నాది చాలా సున్నితమైన మనసు. నాలాంటి వారు రాజకీయాలకు పనికి రారు. భవిష్యత్‌లో దర్శకుడిని అవుతాను కానీ పొలిటీషియన్‌ని కాను.
– ‘అల్లరి’ నరేశ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top