
అక్కినేని హీరో అఖిల్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు జైనాబ్ రవ్దీని ఆయన పెళ్లాడారు. ఈ నెల ఆరో తేదీన వీరిద్దరు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. జూబ్లీహిల్స్లో నాగార్జున నివాసంలో శుక్రవారం (జూన్ 6న) ఉదయం మూడు గంటలకు ఈ వివాహం జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో టాలీవుడ్ తారలు, సన్నిహితులు సందడి చేశారు.
పెళ్లి తర్వాత హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరిగిన రిసెప్షన్ వేడుకలో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. తాజాగా పెళ్లి తర్వాత తొలిసారి తన మ్యారేజ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నా జీవితంలో అత్యుత్తమ రోజులో కొన్ని క్షణాలను మీతో పంచుకోవాలని నా హృదయానికి అనిపించిందని క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ మధుర జ్ఞాపకాలు అందించిన వారికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు.
కాగా.. గతేడాది అక్కినేని నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూలిపాళ్లను ఆయన పెళ్లాడారు. వీరి పెళ్లి ప్రకటన తర్వాతే అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. జైనాబ్ రవ్దీతో నిశ్చితార్థం జరిగినట్లు అక్కినేని నాగార్జున వెల్లడించారు. ఈ ఏడాదిలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టారు.