ఈ ఏడాది ప్లాన్‌ ఇదే

Aishwarya Rajesh and Lakshmi Roy‌ reveals new year plans - Sakshi

కొత్త సంవత్సరం ప్రారంభమైపోయింది. ఈ ఏడాది ఏమేం చేయాలా అని ఆల్రెడీ ప్లాన్‌ సిద్ధం చేసుకున్నారు చాలామంది. మరి మీ ప్లాన్స్‌ ఏంటి అని హీరోయిన్లు ఐశ్వర్యా రాజేష్, లక్ష్మీ రాయ్‌ని అడిగితే ఇలా చెప్పారు.

ఆరోగ్యం మీద మరింత దృష్టి పెడతాను
2020 మనకు ఆరోగ్యం ఎంత ముఖ్యమైనదో చెప్పింది. రోగనిరోధక శక్తిని కాపాడుకోవాలని గుర్తు చేసింది. ఫిట్‌నెస్‌ అనేది మనందరి జీవితాల్లో ఎంతో ముఖ్యమైనది. ఫిట్‌నెస్‌ మనకు ఒకలాంటి ధైర్యాన్ని తీసుకువస్తుంది. మరింత పని చేసే శక్తి, ఉత్సాహం వస్తుంది. ఫిట్‌నెస్‌ వల్ల తెలియకుండానే ఒకలాంటి పాజిటివ్‌ లైఫ్‌స్టయిల్‌ అలవడుతుంది. ఇక నుంచి మరింత ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకునేలా జాగ్రత్తపడతాను. మన పూర్వీకులు తీసుకునే రాగులు, మిల్లెట్స్‌ అన్నీ నా డైట్‌లో భాగం చేస్తాను. అలానే ఈ ఏడాది కూడా కంటెంట్‌ ఉన్న సినిమాల్లోనే భాగమవ్వడానికి ప్రయత్నిస్తాను.
– ఐశ్వర్య

2020 నేర్పిన పాఠం మర్చిపోవద్దు     
గత ఏడాది మనలో చాలామందికి అనుకున్నట్టు జరగలేదు. కానీ మనందరికీ చాలా పాఠాలు నేర్పింది. మనందరం మర్చిపోయిన విషయాల్ని గుర్తుచేసింది. ఇలాంటి కష్టమైన సందర్భాలే చాలా విషయాలను త్వరగా గ్రహించేలా చేస్తాయి. 2020 నాకు చాలా ఓపిక నేర్పింది. మనలోని ప్రతి ఒక్కరికీ, అలానే మన సమాజానికి మానవత్వం మరింత ముఖ్యం అని చెప్పింది. 2020 నేర్పించిన పాఠాలను మనం ఎప్పటికీ మరచిపోకూడదు. ఈ పాఠాలతో ఈ మహమ్మారి దాటాలి. మళ్లీ మునుపటి పరిస్థితి త్వరగా వచ్చేలా చేసుకుందాం.
– లక్ష్మీరాయ్‌

whatsapp channel

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top