హీరోయిన్ మీరా వాసుదేవన్ గురించి తెలుగువారికి కూడా సుపరిచితమే. గోల్ మాల్ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భామ.. 2001లో సీరియల్ ద్వారా బుల్లితెరపై నటిగా పరిచయమైంది. ఆ తర్వాత అంజలి ఐ లవ్యూ అనే చిత్రంలోనూ మెరిసింది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మీరా వాసుదేవన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి ప్రస్తావించింది. తాను మూడు పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో చాలా పెద్ద తప్పులు చేశానని తెలిపింది. ఇప్పుడైతే చాలా ప్రశాంత జీవితం కొనసాగిస్తున్నానని వెల్లడించింది. పెళ్లిళ్లు చేసుకుని దాదాపు 17 సంవత్సరాలు వృథా చేశానని పేర్కొంది. అర్థం లేని మూడు పెళ్లిళ్లకు అనవసరంగా సమయాన్ని కేటాయించానని వెల్లడించింది. పెళ్లి విషయంలో తాను మరింత తెలివిగా వ్యవహరించి ఉండాల్సిందని ఆమె అన్నారు.
మూడోసారి కూడా విడాకులు తీసుకుని ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని మీరా వాసుదేవన్ తెలిపింది. నాకు నచ్చిన పనులు, సేవ చేస్తూ ఆనందంగా ఉంటున్నట్లు వాసుదేవన్ చెప్పుకొచ్చారు. తన తల్లిదండ్రులు, సోదరితో ఎక్కువ సమయం గడిపుతున్నానని తెలిపారు. తన సంబంధాలలో గౌరవం ఇవ్వని వ్యక్తులతో సమయాన్ని వృథా చేసుకున్నానని అన్నారు.
పర్సనల్ లైఫ్..
కాగా.. మీరా వాసుదేవన్.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కుమారుడు విశాల్ అగర్వాల్ను 2005లో పెళ్లి చేసుకుంది. మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. దీంతో ఐదేళ్లకే విడాకులు తీసుకున్నారు. 2012లో మలయాళ నటుడు జాన్ కొక్కెన్ను పెళ్లాడింది. వీరి దాంపత్యానికి గుర్తుగా బాబు పుట్టాడు. కొన్నాళ్లకు ఈ జంట కూడా విడిపోయింది.
వీరిద్దరు 2016లో విడాకులు తీసుకున్నారు. కుడుంబవిలక్కు సీరియల్ షూటింగ్లో కెమెరామెన్ విపిన్తో లవ్లో పడింది. కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డారు. ఈ క్రమంలో 2024 మేలో కోయంబత్తూరు వేదికగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కానీ, ఈ మూడో పెళ్లి కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 2025 ఆగస్టులో విడాకుల విషయాన్ని ప్రకటించింది. దీంతో మూడు పెళ్లిళ్లు ఇలా పెటాకులయ్యాయి.


