తల్లిదండ్రులతో తమన్నా
తమన్నా... ఈ పేరు చెప్పగానే అందం, అభినయం గుర్తొస్తుంది. ఆమె ఫ్యాన్స్ మాత్రం మిల్కీ బ్యూటీ అంటూ ప్రేమగా పిలుచుకుంటుంటారు. హీరోయిన్గా అయినా.. స్పెషల్ సాంగ్స్ చేసినా.. లేడీ ఓరియంటెండ్ మూవీస్లో నటించినా తనదైన నటన, డ్యాన్సులతో ప్రేక్షకులను అలరిస్తుంటారామె. రీల్ లైఫ్లో గ్లామరస్గా, మోడ్రన్గా కనిపించినప్పటికీ రియల్ లైఫ్లో మాత్రం చాలా భక్తి భావంతో ఉంటారు తమన్నా.
సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత కోసం ఆలయాలను సందర్శించడం, పూజలు చేయడం, ధ్యానం చేయడం తన జీవితంలో ఒక భాగమని చెబుతుంటారామె. ఈ నేపథ్యంలోనే ముంబైలోని తన ఇంట్లో ఇషా యోగా సెంటర్కు చెందిన సాధ్వీల ఆధ్వర్యంలో లింగ భైరవీ దేవి పుణ్య పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు తమన్నా. ఆ ఫొటోలను, ఆ సమయంలో తనకు కలిగిన ఒక మ్యాజికల్ ఫీలింగ్ను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ‘‘లింగ భైరవీ దేవి పుణ్య పూజకు ముందు ముంబైలో భరించలేని వేడి వాతావరణం ఉండేది.
ఈ కారణంగా పూజకు వచ్చిన అతిథులు ఇబ్బంది పడతారేమోనని ఆందోళన చెందాను. అయితే పూజ జరిగే రోజు ఉదయం నిద్రలేచి చూడగా అనూహ్యంగా వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొన్ని రోజులుగా ముంబైని కమ్మేసిన వేడి మాయమైంది. దీపారాధన చేయక ముందే వర్షం రూపంలో లింగ భైరవీ దేవి మా ఇంటికి వచ్చిందనిపించింది.
పూజ పూర్తయినా కూడా నేను అమ్మవారి పక్కనే కూర్చుండి పోయాను. పూజ పూర్తయి అందరూ వెళ్లి పోయిన తర్వాత కూడా ఆ ఇంట్లో ఏదో దైవిక శక్తి నిలిచి పోయిన అందమైన అనుభూతి నాకు కలిగింది. ఈ ప్రత్యేకమైన రోజును కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి జరుపుకోవడం ఆనందాన్నిచ్చింది’’ అని తమన్నా పేర్కొన్నారు.


