కోలీవుడ్లో బ్లాక్బస్టర్ నిలిచిన చిత్రం 'లబ్బర్ పందు'. 2024లో సెప్టెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం విజయ్ గోట్ మూవీతో పోటీ పడింది. పెద్దగా ఫేమ్ లేని నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. 2024 ఉత్తమ చిత్రాల జాబితాలో 'లబ్బర్ పందు' కూడా చేరిపోయింది. రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్తో నిండిన గ్రామీణ క్రికెట్ డ్రామాగా ఈ మూవీని తమిళరాసన్ పంచముత్తు తెరకెక్కించాడు.
తాజాగా లబ్బర్ పందు మూవీని వదులుకోవడంపై స్టార్ నటుడు ఎస్జే సూర్య స్పందించారు. తనకు మొదట ఆఫర్ చేసిన పాత్రను తిరస్కరించడానికి గల కారణాన్ని ఆయన వెల్లడించారు. బుధవారం జరిగిన ఎల్ఐకే సక్సెస్ మీట్లో సూర్య మాట్లాడారు. ఓ సారి దర్శకుడు లబ్బర్ పందు స్క్రిప్ట్తో నన్ను సంప్రదించారని తెలిపారు. నా ఇమేజ్కు సరిపోయేలా కొన్ని మార్పులు చేయమని నేను అతన్ని అడిగా.. ఆయన దానికి పూర్తిగా అంగీకరించారు. కానీ ఆ మార్పులు పెరుగుతూ పోవడంతో.. నేనే మళ్లీ ఆలోచించానని అన్నారు. నా కోసం మీరు మీ మొత్తం కథను మారుస్తూ ఉంటే.. ఒక డైరెక్టర్గా మీ వ్యక్తిత్వాన్ని మీరు కోల్పోతారని అతనితో చెప్పానని వెల్లడించారు. అందుకే నేను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా అని డైరెక్టర్కు వివరించానని అన్నారు. కాగా.. ఈ మూవీలో అట్టకత్తి దినేష్ పోషించిన ఆ పాత్రను మొదట సూర్యకు ఆఫర్ చేశారు డైరెక్టర్ తమిళరాసన్.
ఇటీవలే ఎస్జే సూర్య ఎల్ఐకే చిత్రంలో కనిపించారు. ఈ మూవీకి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించగా.. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించారు. ఈ మూవీలో ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఎస్జే సూర్య.. ప్రీతి అశ్రాని సరసన నటిస్తున్నారు. 'కిల్లర్' చిత్రంతో దర్శకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాకుండా రజనీకాంత్ 'జైలర్ 2'లో కూడా భాగమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి, అయితే ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ఇంకా ధృవీకరించలేదు. 'కిల్లర్'తో పాటు, కార్తితో 'సర్దార్ 2', 'బ్రో కోడ్' చిత్రాలు చేస్తున్నారు.


