నన్ను తీసేశారా అని భయపడ్డాను | Sakshi
Sakshi News home page

నన్ను తీసేశారా అని భయపడ్డాను

Published Thu, Oct 26 2023 4:14 AM

Actor Charan Raj Speech At Narakasura Movie Trailer Launch - Sakshi

‘పలాస’ ఫేమ్‌ రక్షిత్‌ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’. అపర్ణా  జనార్ధన్, సంకీర్తనా విపిన్‌ హీరోయిన్లుగా సెబాస్టియన్‌ నోవా అకోస్టా జూనియర్‌ దర్శకత్వంలో డా. అజ్జా శ్రీనివాస్‌ నిర్మించారు. ఈ చిత్రం నవంబరు 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఓ కీ రోల్‌ చేసిన చరణ్‌రాజ్‌ బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను.

ఎనిమిదేళ్లు కష్టపడ్డాను. ఆకలి బాధలు అనుభవించాను. ఫలితంగా సినీ ఇండస్ట్రీలో సుధీర్ఘమైన 40 ఏళ్ల కెరీర్‌ లభించింది. వివిధ భాషల్లో ఐదు వందలకు పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేశాను. అయితే ‘ప్రతిఘటన, జెంటిల్‌మేన్‌’ సినిమాలు నన్నొక నటుడిగా తెలుగు ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా చేశాయి. ఇక దర్శకుడు సెబాస్టియన్‌ నాకు ‘నరకాసుర’ కథ చెప్పినప్పుడు నా పాత్రకు బాగా ఎగ్జయిట్‌ అయ్యాను. కానీ రెండు నెలలు గడిచినా సెబాస్టియన్‌గారి నుంచి ఫోన్‌ రాలేదు.

మేం చేస్తే కనెక్ట్‌ కాలేదు. దీంతో ‘నరకాసుర’లోంచి నన్ను తీసేశారా అనే భయం కలిగింది. కథా రచనలో భాగంగా జబల్‌పూర్‌ వెళ్లానని, అందుకే ఫోన్‌ కలవలేదని, ‘నరకాసుర’లో నాకు చెప్పిన పాత్రను నేనే చేస్తున్నట్లుగా సెబాస్టియన్‌గారు ఆ తర్వాత చెప్పారు. అప్పుడు రిలాక్స్‌ అయ్యాను. ఈ సినిమాలో నా పాత్ర మంచికి మంచి, చెడుకు చెడు అన్నట్లుగా ఉంటుంది. నా కెరీర్‌లో ఇప్పటివరకు చేయని ఓ ప్రత్యేక పాత్రను ఈ సినిమాలో చేశాను. ప్రస్తుతం శ్రీహరిగారి అబ్బాయి మేఘాంశ్‌ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాను’’ అని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement