బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ అడపా దడపా సినిమాలు చేస్తున్నారు. గతేడాది కాళిధర్ లపట్టా, హౌస్ఫుల్-5 చిత్రాలతో మెప్పించారు. అమితాబ్ బచ్చన్ వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టిన బచ్చన్.. బాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో ఉండగానే నటి ఐశ్వర్య రాయ్ను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈనెల 21న బాలీవుడ్ జంట తమ 19 వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అభిషేక్.. ఐశ్వర్యతో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఐశ్వర్యతో రిలేషన్, ప్రేమ ఎలా మొదలైందన్న సీక్రెట్ను అభిషేక్ పంచుకున్నారు. 2000 సంవత్సరంలో ధాయ్ అక్షర్ ప్రేమ్ కే' సెట్స్లో ఐశ్వర్యను మొదటిసారి కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే అప్పుడు మా మధ్య రిలేషన్ కేవలం స్నేహపూర్వకంగా మాత్రమే ఉండేదన్నారు. అప్పుడు తనతో లవ్ అనే ఆలోచనే నాకు రాలేదన్నారు. కానీ 2006లో 'ఉమ్రావ్ జాన్' సినిమా చిత్రీకరణ సమయంలో మా మధ్య ప్రేమ చిగురించిందని అభిషేక్ తెలిపారు. మణిరత్నం దర్శకత్వం వహించిన 'గురు' సినిమా టైమ్లో మా బంధం మరింత బలపడిందన్నారు. దర్శకుడు మణిరత్నం మా ఇద్దరికీ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని.. ఆయన ఒక స్నేహితుడిగా మాత్రమే కాదు.. గాడ్ఫాదర్ అని ప్రశంసించారు.
తమ కూతురు ఆరాధ్యను సరైన విలువలతో పెంచిన పూర్తి ఘనత ఐశ్వర్యకే దక్కుతుందన్నారు. ఐశ్వర్య కేవలం నా కూతురికి తల్లి మాత్రమే కాదు.. నా సోల్మేట్ కూడా అని కొనియాడారు. కాగా.. న్యూయార్క్లో జరిగిన 'గురు' ప్రీమియర్లోనే అభిషేక్, ఐశ్వర్యకు ప్రపోజ్ చేశారు. ఇది వారి లైఫ్లో ఓ అపూర్వమైన ఘట్టంగా నిలిచింది. నిశ్చితార్థం తర్వాత ఏప్రిల్ 2007లో వీరిద్దరి వివాహం జరిగింది.


