● జిల్లాలో 20 నుంచి 50శాతం భూముల రేట్లు పెంపు ● మెదక్ సబ్ రిజిస్ట్రార్ కిరణ్కుమార్
మెదక్ కలెక్టరేట్: బహిరంగ మార్కెట్లో ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం భూముల విలువను పెంచినట్లు మెదక్ సబ్ రిజిస్ట్రార్ కిరణ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం సాక్షితో మాట్లాడారు. ఈ పెంచిన ధరలు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపారు. దీని ప్రకారం నివాస, కమర్షియల్ స్థలాల ధరలను 20 నుంచి 50 శాతం పెంచగా, వ్యవసాయ భూముల ధరలను 75 శాతం మేర పెంచారన్నారు. ఈ మార్పులు మెదక్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని మెదక్ మున్సిపాలిటీ సహా 8 మండలాలు, 160 గ్రామాల్లో వర్తించనున్నాయన్నారు. మెదక్ పట్టణ పరిధిలోని విలీన గ్రామాలైన ఔరంగాబాద్, అవుసులపల్లి, పిల్లికోటాల్, ఫత్తేనగర్ వంటి ప్రాంతాల్లో భూముల ధరలు 20 నుంచి 50 శాతం పెరిగాయని తెలిపారు. అయితే, ప్రజల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని స్లమ్ ఏరియాల్లోనూ, మెదక్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీ, గోల్కొండ వీధిలోని 1–9 ఇంటి సిరీస్ వంటి ప్రాంతాల్లోనూ పాత ధరలనే కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ ధరల పెంపుతో రిజిస్ట్రేషన్లపై పెద్దగా ప్రభావం ఉండదని, రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగి తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు.


