● కొనుగోళ్లు చేయడం లేదని రైతుల ఆగ్రహం ● ధాన్యం తగలబెట్టేందుకు యత్నం ● అడ్డుకున్న అధికారులు
అల్లాదుర్గం(మెదక్): బస్తాకు నాలుగు కిలోల తరుగు పేరుతో దొపిడీ చేయడం తగదని, కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేయడం లేదని రైతులు ఆగ్రహించారు. రోడ్డుపై ధాన్యాన్ని పోసి తగులబెట్టేందుకు ప్రయత్నించారు. రైతులు మాట్లాడుతూ అల్లాదుర్గం ఐబీ చౌరస్తాలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. రైసు మిల్లుర్లు బస్తాకు నాలుగు కిలోల తరుగు ఇస్తే తీసుకుంటారని సిబ్బంది చెబుతున్నారని తెలిపారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ మల్లయ్య, సీఐ రేణుకారెడ్డి, ఎంపీడీఓ వేదప్రకాశ్రెడ్డి అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. తరుగు ఎక్కువగా కట్చేస్తే కేసులు నమోదు చేస్తామ న్నారు. ఐకేపీ సీఏపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం తరలించే ఏర్పాట్లు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో శాంతించారు.


