అల్లాదుర్గం(మెదక్): టీచర్లు క్రమశిక్షణ తప్పారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఒకరు దూరంగా ఉండగా.. మరోకరు నిర్లక్ష్యంగా జాతీయ జెండాను ఎగురవేశారు. మండల పరిధిలోని సీతానగర్ తండా ప్రాథమిక పాఠశాల టీచర్ ఆవిర్భావ వేడుకలకు దూరంగా ఉన్నారు. పాఠశాల వద్ద జాతీయ జెండాను ఎగురవేయలేదని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై టీచర్ను ప్రశ్నించగా మా ఊరు దూరంగా ఉంది.. రాలేకపోయానని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల వద్ద జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇతరులకు మార్గదర్శంగా ఉండాల్సిన టీచర్లు నిర్లక్ష్యం వహించడంపై విమర్శలకు గురవుతున్నారు. అల్లాదుర్గం కాన్షీరాంనగర్ ప్రాథమిక పాఠశాల వద్ద జాతీయ జెండాను అవమానిస్తూ, సగం వరకే ఎగురవేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీచర్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆవిర్భావ వేడుకలకు ఒకరు దూరం.. మరోకరు నిర్లక్ష్యం


