చిలప్చెడ్(నర్సాపూర్): కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు నానాఅవస్థలు పడుతున్నా.. అధికారుల తనిఖీలే తప్ప సమస్యలు పరిష్కరించడం విఫలమయ్యారని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. మంగళవారం మండల పరిధిలోని చిట్కుల్ చౌరస్తా, ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నేతలతో కలిసి ధర్నా చేశారు. దీంతో చాలా సేపు ట్రాఫిక్ అంతరాయం కలగడంతో.. తహసీల్దార్ శివప్రసాద్, పోలీసులు చర్చించి ధర్నా ఆపేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. రైతులను పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి నెల గడుస్తున్నా తూకం జరగడంలేదని, తూకం జరిగినా లారీలు రావడం లేదన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు ఆవేదనకు గురవుతుంటే, అధికారులు వచ్చి ఫొటోలు దిగి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూకం 44 కిలోలు పెడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మిల్లుల యజమానులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ, కోతలు విధిస్తున్నా చూస్తూ ఊరుకోవడం ఎంటని నిలదీశారు. రైతులకు న్యాయం చేయకపోతే తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అశోక్రెడ్డి, ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్, ఉద్యమ నాయకుడు చంద్రశేఖర్రెడ్డి, నాయకులు మధుసూదన్రెడ్డి, అనిల్, బలవంత్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆగ్రహం


