రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం
చిన్నశంకరంపేట(మెదక్): మద్యం మత్తులో పాడుబడిన బావిలో పడిన కూలీని ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. ఈ సంఘటన మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. ఏపీ, మార్కాపురం జిల్లా కొమురోలు మండలం నల్లగుంట్లకు చెందిన మంద భాస్కర్ మిర్జాపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి కూలి పనులు చేసేందుకు వచ్చాడు. రాత్రి సమయంలో మద్యం మత్తులో బావిని గమనించపోవడంతో కాలు జారి పడిపోయాడు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి ఎస్ఐ శివానందం, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకొని నిచ్చెనవేసి బావిలోకి దిగారు. బావిలో పడిన వ్యక్తిని సురక్షితంగా బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పగాయాలు కావడంతో అంబులెన్స్లో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన పోలీసులకు, ఎన్డీఆర్ఎఫ్ బృంద సభ్యులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.


