టేక్మాల్(మెదక్)/నర్సాపూర్ రూరల్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతులు ఆగ్రహం వ్య క్తం చేశారు. టేక్మాల్ చౌరస్తాలో బొడ్మట్పల్లి– మెదక్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రైస్ మిల్లర్లు ధాన్యం తీసుకోవడానికి నిరాకరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వీరప్ప, జిల్లా యువజన విభాగం కార్యదర్శి నాయికోటి భాస్కర్ తదితరులు రైతులకు మద్దతు తెలిపారు. ఎస్సై అరవింద్ కుమార్, రెవెన్యూ అధికారులు రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. అలాగే నర్సాపూర్– సంగారెడ్డి రహదారిలోని ఆవంచ గేటు వద్ద ధాన్యం అన్లోడ్ చేసుకోవడం లేదని రైతులు రాస్తారోకో చేశారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీల కొరత ఉందని, సొంతంగా ట్రాక్టర్లు ఏర్పాటు చేసి రైస్ మిల్లులలో అన్లోడ్ చేసేందుకు వెళ్లగా హమాలీలు లేరని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు, అధికారులు కల్పించుకొని రైతుల రాస్తారోకోను విరమింప చేశారు.


