కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ వీధిలో రూ. 5 కోట్లతో చేపడుతున్న భవన నిర్మాణాన్ని శుక్రవారం పరిశీలించి పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళల శిక్షణకు, ఉత్పత్తుల మార్కెటింగ్కు ఈ భవ నం ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. నిర్మాణంలో ఎలాంటి నాణ్యత లోపాలు కనిపించొద్దని స్పష్టం చేశారు. గడు వులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించా రు. అలాగే జిల్లాలో జరుగుతున్న యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీశారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి రైతులకు ఇబ్బందులు లేకుండా వెంట వెంటనే ధాన్యాన్ని లారీల్లో రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తూ రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. అనంతరం రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. అన్నిశాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు.


